ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో పరాజయం. గురువారం రాత్రి వాంఖెడేలో చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైందీ టీమ్. సమష్టిగా విఫలమైంది. తొలుత బౌలింగ్ లో, ఆ తర్వాత బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించలేదు. గెలవడానికి 208 పరుగులు చేయాల్సి ఉన్నప్పటికీ.. టాప్ టు బాటమ్ వరకూ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మాత్రమే కాస్తో, కూస్తో పరుగులు చేశారు.
టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్.. ఈ ఐపీఎల్ లో ఏడు ఇన్నింగ్స్లలో నాలుగు సిక్సర్లు మాత్రమే కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై సూర్యకుమార్ 30 బంతుల్లో 35 పరుగులు చేసినప్పటికీ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. ఈ సీజన్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేలవ ప్రదర్శన ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే విమర్శలు చెలరేగుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

ఈ పరిణామాలపై తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్దనే స్పందించాడు. హార్దిక్ పాండ్యా సహా జట్టును వెనకేసుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా బ్యాట్తో రాణించాడని, సీజన్ మొదటి కొన్ని మ్యాచ్లలో బౌలింగ్లో కూడా చక్కగా బౌలింగ్ చేశాడని గుర్తు చేశాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ గానీ, బౌలింగ్ గానీ పెద్దగా ఆందోళన కలిగించే విషయం కాదని తేల్చి చెప్పాడు. అతను మొదట్లో బాగానే బ్యాటింగ్ చేశాడని, చాలా బాగా బౌలింగ్ చేశాడనీ సమర్థించుకున్నాడు.
ప్రత్యర్థులపై ప్రభావం చూపడంలో జట్టు మొత్తం వైఫ్యలం చెందిందని మహేల పేర్కొన్నాడు. మొత్తం మీద, ఓ యూనిట్గా తాము నిలకడగా ఆడట్లేదని, త్వరగా వికెట్లు తీయలేకపోయామని, పరిస్థితులను నియంత్రించడంలో విఫలమౌతున్నామని చెప్పాడు. దీన్ని ఏ ఒకరిద్దరు బ్యాటర్లు, బౌలర్లకు అపాదించడం సరికాదని వివరించాడు. నిలకడగా ఆడలేకపోవడం ఏ ఒక్క ఆటగాడి సమస్య కానే కాదని, జట్టు మొత్తానికి సంబంధించినదని వ్యాఖ్యానించాడు. జట్టు, ప్లేయర్లు మళ్లీ గాడిన పడతారని, అదెంతో దూరం లేదని ధీమా వ్యక్తం చేశాడు జయవర్ధనే.