
ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే.. ముంబై వరుస పరాజయాల అనంతరం జట్టులో కీలక మార్పులు తప్పవనే హింటిచ్చాడు. స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ విషయంలో ఆందోళన ఉన్నప్పటికీ.. అతనితో మాట్లాడి సెట్ చేస్తామన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అయిదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్తో సహా తమ వరుసగా ఎనిమిది మ్యాచ్ల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శనను ముంబై కనబరుస్తోంది. ఈ క్రమంలో ముంబై బ్యాటింగ్ లైనప్లో ఏమైన మార్పులు ఉంటాయా అని ప్రెస్ మీట్లో మీడియా ప్రశ్నించగా.. జయవర్ధనే స్పందిస్తూ.. 'ఈ విషయమై సమీక్షిస్తాం. మిగిలిన కోచ్లతో డిస్కస్ చేస్తా. కోచ్లు కూడా వారి వ్యూస్ చెబుతారు. కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని తదనుగుణంగా జట్టులో మార్పులు చేస్తాం' అని తెలిపాడు.
జయవర్ధనే తమ జట్టు ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. 'మంచి వికెట్ పిచ్లపై మా జట్టు బ్యాటింగ్ సరిగా చేయకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మా బ్యాటింగ్ లైనప్లో సీనియర్ గ్రూప్ (రోహిత్, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్) ఉంది. గతంలో వాళ్లు పరిస్థితులను అర్థం చేసుకుని, మంచి ప్రదర్శన చేశారు. వాళ్లు ఒత్తిడి అధిగమించి కుదురుగా ఆడేలా ఏమైనా చేయాలి. అయినా మార్పులు తప్పనిసరి అయితే.. జట్టులో మార్పులు చేస్తాము. జట్టుపరంగా కొన్ని మార్పులైతే జరుగుతాయి. మా బ్యాటింగ్ లైనప్లో నిలకడ పెంచాలనుకుంటున్నాం. మేము మొదట బ్యాటింగ్ చేస్తున్నా, ఛేజింగ్ చేస్తున్నా.. మా బ్యాటింగ్లో నిలకడ లేదు. అందుకే ఆందోళన నెలకొంది' అని జయవర్ధనే పేర్కొన్నారు.

మొదటి రెండు గేమ్లలో హాఫ్ సెంచరీలు చేసిన తర్వాత ఇషాన్ కిషన్ గ్రాఫ్ బాగా పడిపోవడంపై మీడియా ప్రశ్నించగా.. జయవర్ధనే స్పందిస్తూ.. కిషన్తో కూర్చుని మాట్లాడతాం. అతను కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. అతను తన సహజమైన ఆట ఆడేలా స్వేచ్ఛ కల్పించాం. అతను ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇంకా తనతో మాట్లాడలేదు. త్వరలోనే అతనితో మాట్లాడతాను.. తను ఎదుర్కొంటున్న ఇబ్బందులను రెక్టిఫై చేసేందుకు చూస్తాం అని చెప్పాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వేలంలో ముంబై జట్టు ఇషాన్ కిషన్ను 15.25కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ కిషన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అలాగే రోహిత్ శర్మ, పొలార్డ్ లాంటి మ్యాచ్ విన్నర్లు సైతం తమదైన ప్రదర్శనలు చేయలేకపోతుండడంతో ముంబై ఓటములను మూటగట్టుకుంటుంది.