న్యూఢిల్లీ: మరి కొద్ది నెలల్లో అమలుకానున్న 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పలువురు స్టార్ సెలబ్రెటీలకు టిక్కెట్లు ఇవ్వనుంది. అంతేకాదు, వారికి ఏ నియోజకవర్గంలో సీటు ఇవ్వాలో కూడా ముందుగానే నిర్ణయించినట్లు సమాచారం. టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
వీరిని ఢిల్లీ, ఆ పరిసర ప్రాంతాల నుంచి పోటీకి దింపే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాజ్యసభ బీజేపీ ఎంపీ రూపా గంగూలీని పశ్చిమబెంగాల్ నుంచి పోటీలోకి దింపనున్నట్టు కూడా చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పోటీగా బీజేపీ అభ్యర్థిగా ఆమెను బరిలోకి దింపే అవకాశాలున్నాయి.
కాగా, పుణె లోక్సభ నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ను పోటీలోకి దింపాలని బీజేపీ కొద్దికాలంగా పట్టుదలగా ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇప్పటికే తమ ఆలోచనను మాధురీదీక్షిత్ ముందుంచారు. 2014 ఎన్నికల్లో పుణె అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున అనిల్ షిరోలె నిలిచి మూడు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఢిల్లీ లేదా మరేదైనా నియోజకవర్గం నుంచి గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్లకు బీజేపీ సీట్లు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరే కాదు. మరికొంతమంది సెలబ్రిటీలను బరిలోకి దింపి విజయాన్ని చేజిక్కుంచుకోవాలని బీజేపీ 2019లోక్ సభ ఎన్నికలపై కన్నేసింది. ఇక గంభీర్ విషయానికొస్తే రాజకీయ అరంగ్రేటం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే వెల్లడించాడు. పలుమార్లు సమాజసేవ గురించి సోషల్ మీడియాలో పోస్టులు ద్వారా అభిప్రాయాలను వ్యక్తపరిచాడు.