స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి చెప్పిన వ్యాఖ్యలను దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వెనక్కి తీసుకున్నాడు. ఘోరమైన తప్పుచేశానని, తాను చెప్పిన విషయాల్లో వాస్తవం లేదని డివిలియర్స్ పేర్కొన్నాడు. అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే
అయితే కోహ్లి అందుబాటులో ఉండకపోవడానికి గల స్పష్టమైన కారణాలు ఎవరికీ తెలియదు. ఈ విషయంలో డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. 'విరాట్ కోహ్లికి కుటుంబం ఎంతో ప్రాధాన్యం. కోహ్లి- అనుష్క శర్మ రెండోసారి పేరేంట్స్ కాబోతున్నారు' అని చెప్పాడు. కోహ్లికి అత్యంత సన్నిహితుడైన డివిలియర్స్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పడంతో అది నిజమేనని, అందుకే కోహ్లి జట్టుకు దూరమయ్యాడని అందరూ భావించారు.

కానీ తాజాగా డివిలియర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నేను ఘోరమైన తప్పు చేశా. అదే సమయంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశా. అది నిజం కాదు. విరాట్ కోహ్లి కుటుంబంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ మంచి జరగాలని కోరుకుంటున్నా. కోహ్లి బాగుండాలి. అతడు ఆటకు విరామం తీసుకోవడానికి గల కారణం ఏమైనప్పటికీ.. మరింత బలంగా, మెరుగ్గా, తాజాగా రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నా'' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
మరోవైపు విరాట్ కోహ్లి ఇంగ్లండ్తో మూడు, నాలుగు టెస్టులకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అంతేగాక చివరి టెస్టులోనూ అతడు అందుబాటులో ఉండటం అనుమానమే అని సమాచారం. కాగా, ఇంగ్లండ్ సిరీస్లో పాల్గొనడంపై కోహ్లి తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని ఇటీవల బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7వ తేదీ నుంచి చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది.