మొదటి సీజన్లో ఆడే అవకాశం లేదు:
లూక్ రైట్ తాజాగా ది గ్రేటెస్ట్ టీ20 పోడ్కాస్ట్తో మాట్లాడుతూ 2008 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాలని తనకు సచిన్ టెండూల్కర్ ఫోన్ చేశారని, కానీ అప్పుడు అది నిజం అనుకోలేదని తెలిపాడు. అయితే అప్పటి ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిబంధనల ప్రకారం అతనికి ఐపీఎల్ మొదటి సీజన్లో ఆడే అవకాశం రాలేదు. ఒకవేళ తన కెరీర్ ఆరంభంలో తనకు ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చుంటే.. తన ప్రతిభ మరింత మెరుగుపడేదని లూక్ రైట్ పేర్కొన్నాడు.
సచిన్ ఫోన్ చేస్తే.. జోక్ అనుకున్నా:
'ఇంగ్లండ్కి ఆడకముందు నేను ఫ్రాంచైజీల తరఫున ఆడి ఉంటే.. నాకు ఎంతో లాభం చేకూరేది. వాస్తవానికి నేను ఐపీఎల్ మొదటి సీజన్ని మిస్ అయ్యాను. సచిన్ టెండూల్కర్ నాకు ఫోన్ చేసి 2008 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాలని కోరారు. కానీ నేను అది జోక్ అనుకున్నాను. ఎవరో పోకిరి కుర్రాళ్లు మిమిక్రి చేస్తున్నారని భావించాను. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నా. ఈ విషయంపై నేను, రవి బొపారా బోర్డుతో మాట్లాడం ఇప్పటికీ గుర్తుంది' అని రైట్ పేర్కొన్నాడు.
పూణే వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం:
లూక్ రైట్ ఐపీఎల్ లీగ్లో ఆడడానికి 2012 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు పూణే వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 'నేను పూణే జట్టులోకి వెళ్ళినప్పుడు యువరాజ్ సింగ్, ఆరోన్ ఫించ్, ఏంజెలో మాథ్యూస్, రాస్ టేలర్ సభ్యులుగా ఉన్నారు. వారితో డ్రెసింగ్ రూం పంచుకోవడం, సలహాలు తీసుకోవడం ఎంతో బాగా అనిపించింది. అవి నేను మెరుగైన ఆటగాడిగా ఎదగడానికి సహాయపడింది. 27, 28 ఏళ్ళ వయసులో చాలా మంచి ఆటగాడిని అయ్యాను' అని లూక్ రైట్ చెప్పుకొచ్చాడు. లూక్ రైట్ ఇంగ్లండ్ తరఫున 50 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.
ఐపీఎల్ నిరవధిక వాయిదా:
కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 29 న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ నిరవధిక వాయిదా పడింది. ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్కప్ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఆ దేశంలో సెప్టెంబరు వరకూ లాక్డౌన్ అమల్లో ఉంది. దీంతో టోర్నీని 2022కి వాయిదా వేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చూస్తోంది. ఇదే నిజం అయితే అక్టోబరు-నవంబరు విండోలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ఆశిస్తోంది.