మెన్ ఇన్ ఆరెంజ్..
ప్రపంచకప్ టోర్నమెంట్ మాంచి ఊపు మీదున్న సమయంలో టీమిండియా జెర్సీ రంగు మారబోతోంది. మ్యాచ్లన్నీ పీక్స్కు చేరుకున్న దశలో భారత క్రికెట్ జట్టు అర్ధాంతరంగా జెర్సీ రంగు మార్చడం ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇదే తొలిసారి. నీలం రంగు జెర్సీలు పోయి.. ఆరెంజ్ కలర్ వచ్చేసింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో మరి కొన్ని గంటల్లో ఆరంభం కాబోయే మ్యాచ్లో ఆరెంజ్ కలర్ జెర్సీలను ధరించి ఆడబోతున్నారు టీమిండియా క్రికెటర్లు. ఈ మ్యాచ్ మనకు కాకపోయినప్పటికీ.. ఇంగ్లండ్కు అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే.. ఆ జట్టు సెమీ ఫైనల్ రేసులో నిలవగలుగుతుంది. లేదంటే దాని కథ కంచికే. ఇంతటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు ముందు.. భారత క్రికెట్ జట్టు తనకు బాగా అచ్చ వచ్చిన నీలం రంగు జెర్సీని త్యజించడం.. దాని స్థానంలో ఆరెంజ్ కలర్ను ధరించడం ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంది.
టీమిండియా క్రికెటర్లా? ఇండియన్ ఆయిల్ వర్కర్లా?
ఆరెంజ్ కలర్ జెర్సీలతో టీమిండియా క్రికెటర్లు ఎలా ఉంటారు? అనే ఊహకు అప్పుడే పదును పెట్టేశారు నెటిజన్లు, ట్విట్టరెట్టీలు. టీమిండియా క్రికెటర్లు క్రికెటర్లుగా లేరని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోలు బంకుల్లో పనిచేసే కార్మికులుగా ఉన్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రంగు మారడంతో అదృష్టం కూడా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ప్రేమికులు. ఇంగ్లండ్తో జరిగే ఈ మ్యాచ్లో గనక భారత జట్టు ఓడిందంటే దానికి పూర్తి బాధ్యత భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) భరించాలని వ్యాఖ్యానిస్తున్నారు మరికొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్. సగం ఆరెంజ్, సగం నీలం రంగుతో బిగ్ బజార్ను ప్రమోట్ చేసేలా ఉందని కూడా కామెంట్లు విసురుతున్నారు అభిమానులు. మొత్తంగా.. ఈ రంగు నచ్చట్లేదని కరాఖండిగా తేల్చేస్తున్నారు.
ఆరెంజ్పై మొదటి నుంచీ విముఖతే..
టీమిండియా క్రికెటర్ల జెర్సీ రంగులో మార్పులు చోటు చేసుకోవడంపై మొదటి నుంచీ విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. విముఖత కనిపిస్తూనే వస్తోంది. ఆరెంజ్ కలర్.. భారతీయ జనతాపార్టీ రంగు కాషాయానికి ప్రతిబింబిస్తోందంటూ దేశంలో రాజకీయంగా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. జెర్సీ రంగు మార్పు వ్యవహారం ఏకంగా లోక్సభలోనే చర్చకు వచ్చింది. దేశం మొత్తాన్నీ కాషాయంగా మార్చేస్తోందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీపై దుమ్మెత్తిపోసింది. టీమిండియాకు కాషాయరంగును పూసిందని, క్రీడారంగాన్ని కూడా రాజకీయంగా కలుషితం చేసిందని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బీజేపీని విమర్శించాయి.
బాగుందంటూ కితాబిస్తోన్న వారూ లేకపోలేదు..
టీమిండియా కొత్త జెర్సీ రంగు బాగుందని, దీన్నే శాశ్వతంగా కొనసాగించాలని కోరుతున్న అభిమానులకూ కొదవ లేదు.
కోహ్లీసేన ఆరెంజ్ కలర్ జెర్సీలు వేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆరెంజ్ కలర్ జెర్సీలో టీమిండియా ప్లేయర్లు కొత్తగా కనిపిస్తున్నారు. నిజానికి ఈ ఆరెంజ్ కలర్ జెర్సీ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆందోళన చెందారు. ఆరెంజ్, నీలి రంగు కాంబినేషన్లో కొత్త డ్రెస్ చాలా బాగుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జట్టు అధికారిక స్పాన్సర్ నైకీ సంస్థ ఈ జెర్సీకి రూపకల్పన చేసింది. తేలికపాటిగా, శరీరంపై చెమట త్వరగా ఆరిపోయేలా సౌకర్యవంతంగా జెర్సీని డిజైన్ చేశారు. ఇన్నాళ్లు నీలి రంగుకు అలవాటు పడ్డ అభిమానులకు టీమిండియా ఆరెంజ్ జెర్సీలో అలరించనుంది.