IPL 2025: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్పై అద్భుత విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ కు బిగ్ షాక్ తగలింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తో పాటు యువ స్పిన్నర్ దిగ్వేష్ రాఠికి జరిమానా విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రిషబ్ పంత్కు రూ.12 లక్షలు జరిమానా విధించగా.. యువ బౌలర్ దిగ్వేష్ రాఠి వరుసగా రెండో సారి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఆగ్రహానికి గురయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి తన వివాదాస్పద వేడుక కోసం తన మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో మళ్లీ వార్తల్లో నిలిచాడు.
స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్కు జరిమానా
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది. 'ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్లో రిషబ్ పంత్ చేసిన మొదటి నేరం కాబట్టి రిషబ్ పంత్కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.'అని బీసీసీఐ తెలిపింది. ఈ సీజన్లో ఈ శిక్షను పొందిన మూడో కెప్టెన్గా రిషబ్ పంత్ నిలిచాడు. రిషబ్ పంత్ కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్ష అనుభవించారు.

దిగ్వేష్ రాఠి మ్యాచ్ ఫీజులో కోత
ముంబై ఇండియన్స్పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించడంలో దిగ్వేష్ రాఠి కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు.అతను తన నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో నమన్ ధీర్ను ఔట్ చేసిన తర్వాత దిగ్వేష్ సంతకం చేసినట్లుగా సంబరాలు నిర్వహించడంపై మ్యాచ్ రిఫరీ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 2.5 కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 నేరం కిందకు వస్తుందని.. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ పేర్కొంది. అతనికి రెండు డీమెరిట్ పాయింట్లు జమ అయ్యాయి. అంతకు ముందు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో వివాదాస్పద సెలబ్రేషన్ కు అతడికి డీమెరిట్ పాయింట్ వచ్చింది. దీంతో మొత్తం 3 డీమెరిట్ పాయింట్లు దిగ్వేష్ రాఠి ఖాతాలో జమయ్యాయి. దిగ్వేష్ రాఠి చర్యపై చాలా మంది మాజీ ఆటగాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.