లక్నో వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడించింది. సన్రైజర్స్ తమ ముందు ఉంచిన 121 పరుగుల లక్ష్యాన్ని కేఎల్ రాహుల్ జట్టు కేవలం 16 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో ఐదు వికెట్లు కోల్పోయినా విజయం మాత్రం లక్నో జట్టునే వరించింది. ఈ విజయంతో లక్నో ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఆరంభం నుంచే తడబడింది. పిచ్ కొంచెం టైట్గా ఉండటాన్ని గమనించిన కేఎల్ రాహుల్ వెంటనే స్పిన్నర్లను రంగంలోకి దించేశాడు. కృనాల్ పాండ్యా తను వేసిన తొలి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దీనిలో సన్రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఉండటం గమనార్హం.

ఆ మరుసటి ఓవర్లోనే రవి బిష్ణోయి వేసిన ఓవర్లో హ్యారీ బ్రూక్ కూడా పెవిలియన్ చేరాడు. ఇలా ప్రధాన బ్యాటర్లంతా ఫెయిలవడంతో లక్నో ముందు సరైన లక్ష్యం నిలపడంలో సన్రైజర్స్ విఫలమైంది. ఛేజింగ్లో కేఎల్ రాహుల్ (35), కృనాల్ పాండ్యా (34) ఇద్దరూ చక్కగా రాణించడంతో లక్నో విజయం దాదాపు ఖరారైంది. ఈ క్రమంలోనే 16వ ఓవర్ చివరి బంతికి పూరన్ భారీ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
దీనిపై మాట్లాడిన కేఎల్ రాహుల్.. 'వికెట్ పరిస్థితి ఏంటో ఒక రోజు ముందే అర్థమైంది. దీంతో ఎలా ఆడాలో ఒక ఐడియా ఉంది. ఆరంభంలో ఒకటి, రెండు ఓవర్లు చూశాం. ఉనద్కత్ వేసిన కట్టర్లు గ్రిప్ అవడం గమనించా. కృనాల్ పాండ్యా పవర్ప్లేలో బాగా బౌలింగ్ చేస్తాడని తెలుసు. అందుకే అతన్ని బరిలో దించా. మేం సాధించిన రెండు విజయాలు కష్టపడి సాధించినవే. రెండింట్లో వేరు వేరు సవాళ్లు ఎదుర్కొన్నాం. మేం ఇక్కడకు వచ్చి కొన్ని వారాలైంది. ఇక్కడ ఒక్కొక్కరూ ఒక్కోలా బ్యాటింగ్ చేస్తారు. కాబట్టి అందరితో సరదాగా కొన్ని విషయాలు మాట్లాడా' అని రాహుల్ చెప్పాడు.