లక్నో సూపర్ జెయింట్స్తో సన్రైజర్స్ చిత్తుగా ఓడింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయీ ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఏ విభాగంలోనూ పెద్దగా రాణించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు కేవలం 121 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. అప్పుడే దాదాపుగా సన్రైజర్స్ ఓటమి ఖరారైంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న లక్నో ముందు ఈ లక్ష్యం చిన్నదని అందరికీ తెలుసు. ఇక బౌలింగ్లో కూడా సన్రైజర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు.
కేఎల్ రాహుల్ (35), కృనాల్ పాండ్యా (34) ఇద్దరినీ తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో సన్రైజర్స్ విఫలమైంది. వీళ్లిద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో లక్నో లక్ష్యం మంచులా కరిగిపోయింది. వీటన్నిటితోపాటు మరో అంశంలో సన్రైజర్స్ చేతులెత్తేసింది. అదే వికెట్ కీపింగ్. సన్రైజర్స్ కీపర్గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా ఎవరు బౌలింగ్ చేస్తున్నా ఆ బంతిని వికెట్ల వెనుక క్యారీ చేయడంలో అన్మోల్ ఫెయిలయ్యాడు.

రియాక్షన్ స్పీడ్ బాగానే ఉన్నా అతని ఆటతీరులో అనుభవ లేమి చాలా స్పష్టంగా కనిపించింది. భువనేశ్వర్ కుమార్, ఫజల్లాక్ ఫరూఖీ వంటి వాళ్లు బౌలింగ్ చేసేటప్పుడు అన్మోల్ తేలిపోయాడు. భువీ, ఉమ్రాన్ ఇద్దరూ తమ ఓవర్లలో వేసిన వైడ్ డెలివరీలను అతను ఆపలేకపోవడంతో రెండూ బౌండరీలకు వెళ్లాయి. చివర్లో ఉమ్రాన్ వేసిన 13వ ఓవర్లో కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్ అందుకొని గాడిలో పడినట్లు కనిపించిన అన్మోల్.. ఆ మరుసటి బంతినే క్యారీ చేయలేక పోయాడు.
అలాగే స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడ్జ్ తీసుకున్న ఒకటి, రెండు క్యాచులు కూడా అన్మోల్ అందుకోలేకపోయాడు. పిచ్ నుంచి అనుకున్నంత బౌన్స్ రాకపోవడం, పేస్ లేకపోవడంతో వికెట్ కీపింగ్ చేయడం కష్టంగా ఉన్న మాట వాస్తవమే. అందుకని ఐపీఎల్ స్థాయిలో ఆడేటప్పుడు ఇంత పేలవంగా కీపింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ ఇదేం కీపింగ్రా? అని ప్రశ్నిస్తున్నారు. హెన్రిక్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్ వంటి కీపర్లు ఉండగా అన్మోల్ను తీసుకోవడం ఎందుకని సన్రైజర్స్ కెప్టెన్ను ప్రశ్నిస్తున్నారు.