లక్నోతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. ఈ ఐపీఎల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు అందరూ ముందుగా బౌలింగ్ ఎంచుకుంటుంటే.. సన్రైజర్స్ సారధి మాత్రం ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ నిర్ణయమే బెడిసి కొట్టింది. ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఆ జట్టు మంచి స్కోరు చెయ్యలేకపోయింది. ఈ క్రమంలో కేవలం 121 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా తడబడింది. కానీ కేఎల్ రాహుల్ (35), కృనాల్ పాండ్యా (34) ఇద్దరూ రాణించడంతో వాళ్ల ఛేజ్ బాగా జరిగింది. ముఖ్యంగా కృనాల్ పాండ్యా ఈ మ్యాచ్లో అదరగొట్టాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లో చెలరేగాడు. సన్రైజర్స్ ఓటమికి అతనే ప్రధాన కారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇలా ఓడిపోవడంపై సన్రైజర్స్ సారధి మార్క్రమ్ స్పందించాడు.

పిచ్ కొంత డ్రైగా ఉండటంతో కొంచెం మంచి స్కోరు చేస్తే గెలిచే అవకాశం ఉంటుందని అనుకున్నానని మార్క్రమ్ చెప్పాడు. తాము చేసిన స్కోరు సరైనది కాదన్నాడు. 'ఆ స్కోరు సరిపోదు. కనీసం 150-160 చేసి ఉంటే కచ్చితంగా మేం కూడా గెలిచే అవకాశం ఉండేది. బ్యాటింగ్కు బాగా కలిసొచ్చే పిచ్ కాదని ముందే అర్థమైంది. కానీ ఆ మాత్రం స్కోరు చేస్తామని అనుకున్నా. అయితే ఈ మాత్రమైనా పోరాడినందుకు సంతోషంగానే ఉన్నా' అని మార్క్రమ్ చెప్పాడు.
బౌలర్లు గట్టిగా పోరాడారని, లేదంటే లక్నో ఇంకా సులభంగా లక్ష్యాన్ని ఛేదించేదని అభిప్రాయపడ్డాడు. 'బౌలర్లు మంచి ఎఫర్ట్ పెట్టారు. చాలా కష్టపడ్డారు. అద్భుతంగా పోరాడారు. కానీ మళ్లీ ఆదివారం నుంచి మేం అంతా కొత్తగా ఆరంభిస్తాం' అని చెప్పాడు. ఇటీవల నెదర్లాండ్స్తో సౌతాఫ్రికా వన్డే సిరీస్ ఆడిన తర్వాత ఎయిడెన్ మార్క్రమ్ నేరుగా సన్రైజర్స్ క్యాంపులో చేరిన సంగతి తెలిసిందే.