లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో కూడా హ్యారీ బ్రూక్ ఫెయిలయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అతను కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అంతకుముందే కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (0) తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలాంటి సమయంలో జట్టును ఆదుకుంటాడు అనుకుంటే బ్రూక్ ఫెయిలవడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.
అంతకుముందు రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా సన్రైజర్స్ బ్యాటింగ్ తడబడింది. ఈ మ్యాచ్లో కూడా బ్రూక్ చెత్తగా ఆడాడు. బ్యాటింగ్కు అనుకూలించిన ఉప్పల్ పిచ్పై రాజస్థాన్ బ్యాటర్లు చెలరేగారు. ప్రపంచంలోని మిగతా లీగుల్లో అదరగొట్టిన బ్రూక్ కూడా ఈ మ్యాచ్లో రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసిన బ్రూక్.. జిడ్డు బ్యాటింగ్తో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఆ ఇన్నింగ్స్ చూసిన తర్వాత చాలా మంది బ్రూక్పై విమర్శల వర్షం కురిపించారు. గతేడాది చివర్లో ఐపీఎల్ మినీవేలంలో మిగతా జట్లతో అతని కోసం గట్టిగా పోటీ పడిన సన్రైజర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.13 కోట్లు ఖర్చు పెట్టి బ్రూక్ను కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్లో అతని ఆట చూసిన వాళ్లు అత భారీ ధరకు కొనుగోలు చేసినందుకే కనీసం పదకొండు మందిలోచోటు దక్కిందని ఫ్యాన్స్ అంటున్నారు. అంతకుముందు బిగ్ బ్యాష్ లీగ్తోపాటు పీఎస్ఎల్ వంటి లీగుల్లో కూడా బ్రూక్ రాణించాడు. దీంతో అతనిపై బాగా అంచనాలు పెరిగాయి.
ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న అభిమానులు.. 'ఇదేం పీఎస్ఎల్ అనుకున్నావా? ఫ్లాట్ పిచ్లపై ఆడేయడానికి?' అని బ్రూక్పై జోకులు వేస్తున్నారు. '13 కోట్లు పెట్టి కొంటే ఇలాగా ఆడేది?' అని మండిపడుతున్నారు. బ్రూక్ అవుటైన తర్వాత సన్రైజర్స్ బ్యాటింగ్కు పెద్ద షాక్ తగిలినట్లు అయింది. దీంతో త్రిపాఠీ, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ చాలా నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇన్నింగ్స్ వేగం చాలా పడిపోయింది.