లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ జట్టుకు అనుకున్న శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. కృనాల్ పాండ్యా వేసిన బంతిని ఆఫ్సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను స్టొయినిస్ చేతికి చిక్కాడు.
ఆ తర్వాత కాసేపటికే కొత్త కుర్రాడు అన్మోల్ప్రీత్ సింగ్ (31)ని ఎల్బీడబ్ల్యూగా అంపైర్ అవుటిచ్చాడు. అయితే అతను రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్లు తేలడంతో బతికిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే మరోసారి కృనాల్ పాండ్యా.. సన్రైజర్స్ను దెబ్బతీశాడు. అతని బౌలింగ్లో అన్మోల్ ప్రీత్ ఎల్బీగా అవుటయ్యాడు. రివ్యూ కోరగా.. బంతి వికెట్లను తాకే విషయంలో అంపైర్స్ కాల్ వచ్చింది. దీంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. అతన్ని కూడా కృనాల్ పాండ్యానే అవుట్ చేశాడు. పాండ్యా వేసిన ఫుల్ డెలివరీని డ్రైవ్ చేసేందుకు మార్క్రమ్ ప్రయత్నించాడు. అయితే అతని బ్యాటును తప్పించుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీంతో కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో మార్క్రమ్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇలా కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు.
తొలి మ్యాచ్లో విఫలమైన అతను ఈ మ్యాచ్లో అయినా రాణిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ రవి బిష్ణోయి వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించిన బ్రూక్.. కేవలం మూడు పరుగులే చేసి అవుటయ్యాడు. ఆ బంతిని బ్రూక్ మిస్ చేయగా.. కీపర్ పూరన్ అతన్ని స్టంపౌట్ చేశాడు. దీంతో కేవలం 55 బంతులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇది చూసిన ఫ్యాన్స్ 'ఏంట్రా ఈ బ్యాటింగ్?' అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.