లక్నోతో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు తడబడ్డారు. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్పై భారీ షాట్లు ఆడటంలో ఘోరంగా విఫలమయ్యారు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఎయిడెన్ మార్క్రమ్, హ్యారీ బ్రూక్ ఇద్దరూ పరమ చెత్తగా బ్యాటింగ్ చేశారు. రాహుల్ త్రిపాఠీ, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబెట్టే క్రమంలో జిడ్డు బ్యాటింగ్తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. చివర్లో అబ్దుల్ సమద్ (21 నాటౌట్) రెండు భారీ సిక్సర్లు బాదాడు.
దీంతో సన్రైజర్స్ 20 ఓవర్లలో 121 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నోకు కూడా ఆశించిన ఆరంభం దక్కలేదు. తొలి రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడిన కైల్ మేయర్స్ (13) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఫజల్లాక్ ఫరూఖీ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు అతను ప్రయత్నించాడు. గాల్లోకి లేచిన బంతిని మయాంక్ అగర్వాల్ వేగంగా పరిగెడుతూ వెళ్లి క్యాచ్ పట్టేశాడు.

ఫామ్లో ఉన్న కైల్ మేయర్స్ ఇలా అవుటవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషించారు. ఈ సమయంలో సన్రైజర్స్ యజమాని కావ్య మారన్ కూడా సంతోషంతో ఎగిరి గంతులు వేసింది. ఇది చూసిన అభిమానులు మరింత సంతోషించారు. పడింది ఒక్క వికెటే అయినా కావ్య సంతోషం తమలో కూడా ఆనందం నింపిందని ఫ్యాన్స్ అంటున్నారు. కావ్య ఇలా సెలబ్రేట్ చేస్తున్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అలాగే సన్రైజర్స్ బ్యాటర్లు దారుణంగా ఆడుతూ పెవిలియన్కు క్యూ కడుతున్నప్పుడు కావ్య చాలా అప్సెట్గా కనిపించింది. చాలా బాధగా ఆమె స్టేడియంలో కూర్చొని ఉన్న ఫొటోలను కూడా అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 'కావ్యను ఇంతలా బాధ పెడుతున్న సన్రైజర్స్ తప్పకుండా దెబ్బతింటారు' అంటూ కొందరు శాపనార్థాలు పెడుతున్నారు కూడా. సన్రైజర్స్ కన్నా కూడా కావ్యకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మరికొందరు కామెట్లు చేస్తున్నారు.