లక్నోతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు పోరాడి ఓడింది. మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో టీం భారీ స్కోరు చేసింది. ఈ వేదికలో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (12) మినహా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ 200పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశారు.
ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో లక్నో టీం 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఒక జట్టు 250పైగా స్కోరు చేయడం ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. ఇంత భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్కు అనుకున్న ఆరంభం దక్కలేదు. రెండు మ్యాచుల తర్వాత ఈ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ శిఖర్ ధవన్ (1), ప్రభ్సిమ్రాన్ సింగ్ (9) విఫలమయ్యారు.

మరో యువ ప్లేయర్ అథర్వ టైడే (66) ధనాధన్ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతనికి జత కలిసిన సికందర్ రజా (36) కూడా రాణించాడు. లియామ్ లివింగ్స్టోన్ (23), శామ్ కర్రాన్ (21), జితేశ్ శర్మ (24) భారీ షాట్లు ఆడినా కూడా అప్పటికే రన్రేట్ భారీగా పెరిగిపోయింది. దీంతోమరో బంతి మిగిలుండగానే 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆ టీం ఆలౌట్ అయింది. ఈ ఓటమిపై పంజాబ్ కింగ్స్ సారధి శిఖర్ ధవన్ స్పందించాడు.
'మేం మరీ ఎక్కువ పరుగులు ఇచ్చేశాం. దానికి మూల్యం చెల్లించుకున్నాం. ఒక ఎక్స్ట్రా పేసర్తో బరిలో దిగాలనే స్ట్రాటజీ దెబ్బ కొట్టింది. అదే సమయంలో కేఎల్ రాహుల్ ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించాడు. నేను కొత్తగా ఏదైనా చేద్దాం అనుకున్నాం.. అది కుదరలేదు. కానీ ఏం పర్లేదు. ఈ ఓటమి నుంచి నేను గుణపాఠం నేర్చుకున్నా. తర్వాతి మ్యాచ్లో మరింత బలంగా తిరిగొస్తాం' అని చెప్పాడు. ఐపీఎల్లో ఇటీవలి కాలంలో ఛేజింగ్ చేసే జట్లు వరుసగా ఓడిపోతున్నాయి.
అయినా తాము ఛేజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం ధవన్కు దెబ్బకొట్టింది. అలాగే షారుఖ్ ఖాన్ వంటి హిట్టర్ను 8వ స్థానంలో బరిలో దింపడం కూడా సరైన ప్లాన్లా కనిపించలేదు. దీని గురించి ప్రశ్నించగా.. 'తనను కావాలని అప్పటి వరకు ఆపలేదు. లివింగ్స్టోన్ క్రీజులో ఉన్నాడు. శామ్ కర్రాన్ కూడా భారీ షాట్లు ఆడతాడు. కొన్నిసార్లు ఈ మార్పులు పనిచేస్తాయి. కొన్నిసార్లు పనిచేయవు' అని పేర్కొన్నాడు.