లక్నో చేతిలో పంజాబ్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్కు ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పో వెంటనే తెలిసొచ్చింది. లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ (54) అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అదే సమయంలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (12) విఫలమయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోనీ (43) కూడా చెలరేగాడు. ఇక మార్కస్ స్టొయినిస్ (72), నికోలస్ పూరన్ (45) కూడా అదరగొట్టారు. దీంతో లక్నో ఏకంగా 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య చేధనలో పంజాబ్కు అనుకున్న ఆరంభం దొరకలేదు. శిఖర్ ధవన్ (1), ప్రభ్సిమ్రాన్ (9) ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. అయితే మరో యువ ప్లేయర్ అథర్వ టైడే (66) రాణించాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సికందర్ రజా (36) కూడా ఫర్వాలేదనిపించాడు. చివర్లో లియామ్ లివింగ్స్టోన్ (23), శామ్ కర్రాన్ (21), జితేశ్ శర్మ (24) కూడా భారీ షాట్లు ఆడారు. కానీ అప్పటికే కావలసిన నెట్ రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. ఇది చూసిన ఫ్యాన్స్కు చాలా కోపం వచ్చింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసేటప్పుడు లియామ్ లివింగ్స్టోన్ను 13వ ఓవర్ వరకు క్రీజులోకి పంపకపోవడాన్ని వాళ్లు తప్పుబట్టారు.
ఇలాంటి ఛేజ్లో పంజాబ్ గెలిచినా, ఓడినా.. అదంతా లివింగ్స్టోన్ చేతుల్లోనే ఉంటుందని, రజా మంచి బ్యాటరే అయినా అంత విధ్వంసకరంగా ఆడలేడని ఫ్యాన్స్ అంటున్నారు. అలాంటప్పుడు లివింగ్స్టోన్ను ముందుగా పంపి ఉండాల్సిందని, అలా చేయకపోవడంతో చివర్లో ఎంత భారీ షాట్లు ఆడినా పంజాబ్ గెలవలేని పరిస్థితి వచ్చేసిందని మండిపడుతున్నారు.
మరి రజా స్థానంలో లివింగ్స్టోన్ లేదంటే షారుఖ్ ఖాన్ వంటి భారీ హిట్టర్లను ముందుగా బరిలో దింపి ఉంటే పంజాబ్ గెలిచేదేమో తెలియదు. కానీ లక్నో ఇంత భారీ స్కోరు చేయడంలో మాత్రం పంజాబ్ బౌలర్ల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఒక్కరంటే ఒక్కరు కూడా లక్నో బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారని కూడా నిపుణులు, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.