వేసవి ఎండల్లో అభిమానులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్న ఐపీఎల్పై కొందరు ఆందోళనకారుల కన్ను పడింది. మొహాలీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్కు అంతరాయం కలిగించేందుకు ఒక వర్గం ప్రయత్నిస్తోంది. ఈ విషయం తెలిసిన పోలీసులు స్టేడియానికి వచ్చే రహదారులన్నింట్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీని మరింత టైట్ చేశారు.
ఇక్కడ నాలుగు నెలలుగా క్వామీ ఇన్సాఫ్ మోర్చా నేతలు నిరసనలు చేస్తున్నారు. వీళ్లు నిరసన చేస్తున్న వైపీఎస్ చౌక్ నుంచి స్డేడియం వైపు వచ్చే దారిని కూడా పోలీసులు మూసివేశారు. అలాగే బురైల్ జైల్ వైపు వెళ్లే మార్గంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్లను అడ్డుగా ఉంచారు. 'కొందరు ఈ మ్యాచ్ సమయంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందింది. అందుకే సెక్యూరిటీని ఇంత టైట్ చేశాం' అని పోలీసు అధికారులు తెలిపారు.

ఇలా కేవలం రహదారులపైనే కాదు. మొహాలీలో ఈ మ్యాచ్ జరిగే పీసీఏ స్టేడియంలో కూడా పోలీసుల బందోబస్తును మరింత పటిష్టం చేశారు. ముఖ్యంగా 'నిహంగ్స్' సిక్ గ్రూప్ ఈ మ్యాచ్కు అంతరాయం కలిగించి, ఆందోళనలు చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జైల్లో ఉన్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలని ఈ బృందం కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ మ్యాచ్కు అంతరాయం కలిగించాలని ప్లాన్ చేసిందట.
కాగా, ఐపీఎల్లో లక్నో, పంజాబ్ రెండు జట్లు ఏడేసి మ్యాచులు ఆడాయి. వీటిలో లక్నో నాలుగింట విజయం సాధించింది. ఈ కారణంగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. పంజాబ్ జట్టు కేవలం మూడు మ్యాచుల్లోనే గెలిచింది. దీంతో ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే అది నాలుగో స్థానానికి చేరుతుంది.