లక్నోతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు పోరాడి ఓడింది. మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో టీం భారీ స్కోరు చేసింది. ఈ వేదికలో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (12) మినహా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ 200పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశారు.
ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో లక్నో టీం 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఒక జట్టు 250పైగా స్కోరు చేయడం ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. ఇంత భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్కు అనుకున్న ఆరంభం దక్కలేదు. రెండు మ్యాచుల తర్వాత ఈ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ శిఖర్ ధవన్ (1) దారుణంగా ఫెయిలయ్యాడు.

ప్రభ్సిమ్రాన్ సింగ్ (9) కూడా విఫలమయ్యాడు. అయితే మరో యువ ప్లేయర్ అథర్వ టైడే (66) ధనాధన్ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతనికి జత కలిసిన సికందర్ రజా (36) కూడా రాణించాడు. లియామ్ లివింగ్స్టోన్ (23), శామ్ కర్రాన్ (21), జితేశ్ శర్మ (24) భారీ షాట్లతో విరుచుకుపడినా కూడా అప్పటికే రన్రేట్ భారీగా పెరిగిపోయింది. చివరి ఐదు ఓవర్లలో 100పైగా పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో లక్నో బౌలర్లు కొంత ప్రతిఘటించారు.
ముఖ్యంగా నవీన్ ఉల్ హక్ చాలా పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు. రవి బిష్ణోయి కూడా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో జట్టు మొత్తం 9 మంది బౌలర్లతో ప్రయోగాలు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే పంజాబ్ బ్యాటర్లు తడబడ్డారు. తమ ఇన్నింగ్స్లో మరో బంతి మిగిలుండగానే 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో లక్నో రెండో స్థానానికి ఎగబాకింది.