పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో 250 పరుగుల మార్కు దాటిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆ జట్టు 16 ఓవర్లకే 20 పరుగుల మార్కు దాటేసింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసి రికార్డులు తిరగరాసింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఈ జట్టుకు శుభారంభం ఇవ్వడంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) విఫలమయ్యాడు. అయితే కైల్ మేయర్స్ (54) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాహుల్ అవుటైన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆయుష్ బదోనీ (43) బరిలో దిగాడు. కొత్తగా మూడో స్థానంలో వచ్చిన అతను కూడా ధనాధన్ ఆటతో ఆకట్టుకున్నాడు.

అతనికి జత కలిసిన మార్కస్ స్టొయినిస్ (40 బంతుల్లో 72) మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు. అతనితోపాటు నికోలస్ పూరన్ (19 బంతుల్లో 45) కూడా అదరగొట్టాడు. ఇలా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ విశ్వరూపం ప్రదర్శించడంతో లక్నో జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో 250 పరుగుల మార్కు దాటిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది.
ఇంతకుముందు ఆర్సీబీ జట్టు ఒకసారి 263 పరుగులతో అదరగొట్టింది. పంజాబ్తో మ్యాచ్లో లక్నో బ్యాటర్ల దూకుడు చూస్తే ఈ రికార్డు కూడా బద్దలు కొట్టేలా కనిపించారు. అయితే డెత్ ఓవర్లలో శామ్ కర్రాన్, అర్షదీప్ సింగ్, రబాడ కొద్దో గొప్పో లక్నో బ్యాటర్లను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆర్సీబీ రికార్డును బద్దలు కొట్టడంలో లక్నో బ్యాటర్లు ఫెయిలయ్యారు. అయినా ఈ ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డు సృష్టించిందీ జట్టు. పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.