లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఆ టీం మిడిలార్డర్ ముంచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్కస్ స్టొయినిస్ (89 నాటౌట్), కృనాల్ పాండ్యా (49) రాణించడంతో మంచి స్కోరే చేసింది. అయితే ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్ (59), రోహిత్ శర్మ (37) ఇద్దరూ ధాటిగా ఆడారు.
తొలి ఓవర్ నుంచే ఎటాకింగ్ క్రికెట్ ఆడిన ఇషాన్ కిషన్ (59) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అదే సమయంలో మంచి టచ్లో కనిపించిన రోహిత్ శర్మ (37) కూడా ఆకట్టుకున్నాడు. వీళ్లిద్దరూ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. వీళ్లిద్దరే ఛేజింగ్ పూర్తి చేసేలా కనిపించారు. అలాంటి సమయంలో బంతి అందుకున్న రవి బిష్ణోయి.. తను వేసిన వరుస ఓవర్లలో ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు.

ఇదే ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (7) అనవసరమైన షాట్కు ప్రయత్నించి, బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత యువ ప్లేయర్ నేహాల్ వధీర (20 బంతుల్లో 16)పై పడింది. ఆ బాధ్యతను అతను సరిగా నిర్వర్తించలేకపోయాడు. కీలకమైన సమయంలో మరీ ఎక్కువ డాట్ బాల్స్ ఆడాడు.
దీంతో టిమ్ డేవిడ్ (32 నాటౌట్)పై ఒత్తిడి పెరిగింది. అతను వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడాడు. విష్ణు వినోద్ (2) కూడా ఒత్తిడికి తలొగ్గాడు. భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ (6 బంతుల్లో 4 నాటౌట్) భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యాడు.
ఇక చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమవగా.. నాలుగు బంతులు ఎదుర్కొన్న గ్రీన్ కేవలం రెండు పరుగులే చేశాడు. ఇక డేవిడ్ మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఈ మ్యాచ్లో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 172 పరుగులే చేసింది. లక్నో ఐదు పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం చెన్నై, లక్నో రెండు జట్లూ చెరో 15 పాయింట్లతో ఉండటం గమనార్హం.