లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడింది. 50 పరుగుల తేడాతో ఓటమిని మూట గట్టుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్పై ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అతని వల్లనే ఢిల్లీ ఓడిందని తిట్టిపోస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వార్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం బాగా బెడిసి కొట్టింది. జట్టు అంతా ఫీల్డింగ్ తప్పిదాలు చేయడంతో లక్నో బ్యాటర్లకు కలిసొచ్చింది.
లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ ఆరంభంలోనే సులభమైన క్యాచ్ ఇచ్చాడు. చేతుల్లోకి వచ్చిన ఈ క్యాచ్ను ఖలీల్ అహ్మద్ నేలపాలు చేశాడు. ఆ తర్వాత చెలరేగిన కైల్ మేయర్స్.. లక్నో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనితోపాటు చివర్లో ఆయుష్ బదోనీ, మార్కస్ స్టొయనిస్, నికోలస్ పూరన్ తలా ఓ చెయ్యి వేయడంతో లక్నో 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి సరైన ఆరంభం దక్కలేదు.

మార్క్ వుడ్ బౌలింగ్లో తడబడిన పృథ్వీ షా.. అదే ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో అంచనాలతో బరిలో దిగిన మిచెల్ మార్ష్ తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఇలాంటి సమయంలో బాధ్యత తీసుకోవాల్సిన వార్నర్ పరమ జిడ్డు బ్యాటింగ్ చేశాడు. ఒక పక్క వరుసపెట్టి వికెట్లు పడుతుండటంతో.. వార్నర్ అతి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 47 బంతుల్లో 56 పరుగులు చేసిన తర్వాత భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు.
అవతలి ఎండ్లో వరుస పెట్టి వికెట్లు పడుతున్నా కూడా ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను దింపకపోవడం కూడా నిపుణులకు ఆశ్చర్యం కలిగించింది. అక్షర్ కనుక వార్నర్తో కొంచెం ముందుగా కలిసి ఉంటే.. ఢిల్లీకి విజయావకాశాలు ఉండేవి. కానీ అక్షర్ను చిట్టచివరి బ్యాటర్గా బరిలో దింపారు. ఈ నిర్ణయంపై అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఇలా వార్నర్ ఆట, నిర్ణయాలతో ఢిల్లీ కొంప ముంచాడని తిట్టిపోస్తున్నారు. మరి ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని, తర్వాతి మ్యాచులో అయినా వార్నర్ తన జట్టును గెలిపించుకుంటాడేమో చూడాలి.