గతేడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ వరకు వెళ్లి సత్తా చాటింది. అయితే ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓటమి పాలై ఇంటి దారి పట్టింది. ఆ జట్టుతో పాటు గతేడాది ఐపీఎల్లో అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కూడా నెగ్గింది. దీంతో ఈ ఏడాది తాము కూడా అదే మాదిరి రాణించాలని లక్నో సూపర్ జెయింట్స్ భావిస్తోంది. ఈ క్రమంలోనే తమ తొలి మ్యాచ్లో ఢిల్లీపై ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్కు దూరమయ్యాడు. అతని సారధ్యంతో గతేడాది ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ ఏడాది ఎలాగైనా తమ ట్రోఫీ కరువు తీర్చుకోవాలని భావిస్తోంది. 2016లో సన్రైజర్స్కు ట్రోఫీ అందించిన డేవిడ్ వార్నర్ ఈసారి ఢిల్లీ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో అభిమానులకు ఈ జట్టుపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

ఈ మ్యాచ్ జరిగే భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఏకానా క్రికెట్ స్టేడియంలో చిన్న స్కోర్ల మ్యాచులు ఎక్కువగా జరుగుతాయి. ఈ ఏడాది జనవరిలో భారత్, న్యూజిల్యాండ్ మధ్య ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కివీస్ 99 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. స్పిన్నర్లకు ఈ పిచ్ నుంచి కొంత సహకారం అందుతుంది. బ్యాటర్లు కొంత ఓపికతో ఆడాల్సి ఉంటుంది. క్రీజులో కుదురుకున్న తర్వాతనే భారీ షాట్లు ఆడే అవకాశం ఉంటుంది. ఏమాత్రం తొందర పడినా బౌలర్ల బుట్టలో పడిపోవడం ఖాయం.
మ్యాచ్ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు 18 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది. అలాగే ఇక్కడ వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ పూర్తిగా జరుగుతుందని, ఫ్యాన్స్కు మంచి థ్రిల్ను పంచుతుందని నిపుణులు అంటున్నారు. ఈ మ్యాచ్లో గెలిచి ఐపీఎల్ స్వీట్ 16 సీజన్లో తమ క్యాంపెయిన్ను విజయంతో ప్రారంభించాలని రెండు జట్లూ తహతహలాడుతున్నాయి. మరి ఈ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.