కేఎల్ రాహుల్ (76; 48 బంతుల్లో, 8x4, 2x6) కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్కు లక్నో సూపర్ జెయింట్స్ 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీపక్ హుడా (50; 31 బంతుల్లో, 7x4) అర్ధశతకం సాధించాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్ల (2/31)తో సత్తాచాటాడు.
లక్నో సూపర్ జెయింట్స్కు పేలవారంభం దక్కింది. 11 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. డికాక్ (8; 3 బంతుల్లో, 2x4) బౌల్ట్, మార్కస్ స్టొయినిస్ (డకౌట్, 4 బంతుల్లో)ను సందీప్ శర్మ క్లీన్బౌల్డ్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో కలిసి ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొలుత వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ క్రమంగా దూకుడు పెంచారు. పవర్ప్లేలో స్కోరుబోర్డును 46కు తీసుకువచ్చారు.

పవర్ప్లే అనంతరం రాహుల్ టాప్ గేర్లోకి దూసుకెళ్లాడు. ఆవేవ్ ఖాన్ వేసిన 8వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీతో రాహుల్ 21 పరుగులు పిండుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ రాహుల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు దీపక్ హుడా కూడా చెలరేగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. దీపక్ 30 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్కు 62 బంతుల్లో 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ప్రమాదకరంగా మారుతున్న దీపక్ హుడాను అశ్విన్ బోల్తాకొట్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన నికోలస్ పూరన్ (11; 11 బంతుల్లో, 1x4) నిరాశపరిచాడు. వికెట్లు పడుతున్నా రాహుల్ దూకుడుగా ఆడటానికే ప్రయత్నించాడు. అయితే 18వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన రాహుల్ బౌల్ట్ చేతికి చిక్కాడు. ఆఖర్లో ఆయుష్ బదోని (18*, 13 బంతుల్లో, 1x4), కృనాల్ పాండ్య (15*; 11 బంతుల్లో, 1x4) ఆశించినంత దూకుడుగా ఆడకపోవడంతో లక్నో 200 స్కోర్ మార్క్ను అందుకోలేకపోయింది.