రోజురోజుకి ప్లేఆఫ్స్ అవకాశాలను ముంబై ఇండియన్స్ సంక్లిష్టం చేసుకుంటుంది. సాంకేతికంగా పోటీలో ఉన్నప్పటికీ నెట్ రన్ రేటుతో సంబంధం లేకుండా టాప్-4లో నిలవాలంటే ముంబై తీవ్రంగా కష్టపడాల్సిందే. మిగిలిన అయిదు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ముంబై 16 పాయింట్లతో తదుపరి దశకు సులభంగానే చేరుకుంటుంది. కానీ అయిదింట్లో గెలవడం అంత ఈజీ కాదు.
కీలక ఆటగాళ్లు ఫామ్లో లేకపోవడం, వ్యూహాల వైఫల్యంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. తొమ్మిది మ్యాచ్ల్లో మూడింట్లో గెలిచి ఆరు పాయింట్లతో సాధించింది. ఈ స్థితిలో ఉన్న జట్టు అన్ని మ్యాచ్ల్లో గెలుస్తుందంటే ముంబై అభిమానులు కూడా కాస్త ఆలోచిస్తారు. అయితే ఈ సీజన్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదనే భావించి ముంబై ఫ్రాంచైజీ రూ.కోట్లు వెచ్చించి హార్దిక్ పాండ్యను తిరిగి సొంతం చేసుకుంది.

అంతేగాక, అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ హార్దిక్ ఆల్రౌండర్గానే కాకుండా కెప్టెన్గా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్సీ నిర్ణయాన్ని యూటర్న్ తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తున్న యాజమాన్యం ఇవాళ సరైన రోజుగా భావిస్తున్నట్లు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరగనున్న మ్యాచ్లో రోహిత్కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. ఏప్రిల్ 30న రోహిత్ శర్మ పుట్టిన రోజు కావడంతో, ఈ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్గా ఇవాళ మ్యాచ్లో కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రానప్పటికీ కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్పై గెలిచి తమ ప్లేఆఫ్స్ అవకావాలు మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. తొమ్మిది మ్యాచ్లు ఆడిన లక్నో అయిదింట్లో గెలిచి పది పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచింది. ఇవాళ మ్యాచ్లో ముంబైపై గెలిస్తే లక్నో మూడో స్థానానికి చేరుతుంది.