Rishab Pant: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో ఆ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ఆటతీరు మరింత దారుణంగా ఉంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ రిషభ్ పంత్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. కనీసం తాజాగా లక్నోలోని ఎకెనా క్రికెట్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచులోనైనా రాణిస్తాడనుకుంటే... మళ్లీ అదే తంతు కొనసాగించాడు.
ఆరు బంతులను ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు రిషభ్ పంత్. ఒక్క ఫోర్ ఒక్క సిక్స్ బాది ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య బౌలింగ్ లో 10.4 ఓవర్ దగ్గర కార్బిన్ బాష్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంత్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో క్రికెట్ అభిమానులంతా పంత్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గ్యాప్ లేకుండా మీమ్స్ రూపంలో ఓ ఆటాడేసుకుంటున్నారు. పాపం లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా పరిస్థితేంటో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

అసలే ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు (రూ.27 కోట్లు) ధరకు రిషభ్ పంత్ ను దక్కించుకుని మరీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది లక్నో యాజమాన్యం. అయితే అతడు మాత్రం ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. అటు కెప్టెన్గా ఇటు బ్యాటర్గా రెండింటిలోనూ విఫలమయ్యాడు. ఈ సీజన్లో పంత్ నాలుగు మ్యాచుల్లో చేసిన మొత్తం పరుగులు 19 మాత్రమే. తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అతడు ఆ తర్వాత మ్యాచ్ల్లో 15, 2 , 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
కాగా, ఈ సీజన్లో లక్నో ఆడిన తొలి మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోగా.. రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ పై గెలిచింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్పై 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఇక ఇప్పుడు నాలుగో మ్యాచులో ముంబయి ఇండియన్స్తో తలపడుతోంది.