LSG VS MI: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని అందుకుంది. ముంబయి ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపు సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అయితే ముంబయి విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం అవ్వగా 9 పరుగులే వచ్చాయి. అందుకు కారణం లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడమే. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, దిగ్వేశ్, అవేశ్ ఖాన్ తలో వికెట్ దక్కించుకుని విజయానికి కారణమయ్యారు. ముఖ్యంగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 21 పరుగులు ఇచ్చిన దిగ్వేశ్కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా వరించింది.
దంచికొట్టింది..!
బ్యాటింగ్ లోనూ లక్నో గట్టిగానే దంచికొట్టింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి భారీగానే 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60: 9 ఫోర్లు, 2 సిక్స్లు), మార్క్రమ్ (38 బంతుల్లో 53: 2 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మొదటి వికెట్కు వీరిద్దరు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు మంచి శుభారంభం అందించారు. ఆ తర్వాత అయుష్ బదోనీ (19 బంతుల్లో 30: 4 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ ( 14 బంతుల్లో 27: 3 ఫోర్లు, ఒక సిక్స్) మంచి ప్రదర్శనే చేశారు. కానీ కెప్టెన్ రిషబ్ పంత్ (2) మాత్రం మళ్లీ విఫలమయ్యాడు. పూరన్ (12) కాస్త దూకుడుగానే ఆడాడు. మిగతా బ్యాటర్లలో అబ్దుల్ సమద్ (4), శార్దుల్ ఠాకూర్ (5*), ఆకాశ్ దీప్ (0), అవేశ్ ఖాన్ (2*) పరుగులు సాధించారు. ముంబయి బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేశ్ పుతుర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

మానసిక ఒత్తిడికి గురయ్యా...!
మ్యాచ్ అనంతరం జట్టు విజయానికి గల కారణాలు వివరించాడు లక్నో కెప్టెన్ రిషభ్ పంత్. "వికెట్ అద్భుతంగా ఉంది. ఇది స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు మేం రాణించడానికి ఏది వర్కౌట్ అవుతుందో, ఏది పని చేయడం లేదో గుర్తించాల్సిన సమయం ఇది. ముందుగా మేము మరో రకమైన వికెట్ ఆశించాం. కానీ ఇప్పుడు పరిస్థితిని అంగీకరించి, దానికనుగుణంగా మార్పులు చేసుకుని ఆడటం అవసరం. మిచెల్ మార్ష్ లాంటి ఆటగాడు మాకు ఆరంభంలో బలమైన ఓపెనింగ్ ఇస్తే, మిడిల్ ఆర్డర్లో మాకు సమయం దొరుకుతుంది. అదే మా వ్యూహం కూడా. పరిస్థితులకు అనుగుణంగా ఆడటం. మిచెల్ ఇచ్చిన ఆరంభం మాకు కలిసొచ్చింది. ఆటలో మంచిగా ముందుకు సాగగలిగాం.మంచి పార్టనర్షిప్స్ వల్ల ముంబయి జట్టు ఎక్కువ వికెట్లు కోల్పోలేదు. ఆ సమయంలో మానసికంగా ఒత్తిడికి లోనయ్యాం. కానీ మేము చివరి దాకా మనసును దృఢంగా ఉంచి, ఆటను గెలిచాం. అదే మా విజయానికి కారణం" అని పంత్ వెల్లడించాడు.
వారు అద్భుతం చేశారు..!
శార్దూల్ ఠాకూర్ గురించి పంత్ మాట్లాడుతూ - "అతడు మా జట్టులో అద్భుతమైన ప్లేయర్. అతడిని మేం ఎంచుకోవడం సరైనదే అని నిరూపించుకున్నాడు. అతడిని పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడాలి. రథి మాకు కీలక బౌలర్. అతడు ఇప్పుడే పరిణతి చూపిస్తున్నాడు. ఒత్తిడిలోనూ బ్యాలెన్స్డ్ గా ఉండి బౌలింగ్ చేస్తున్న తీరు ప్రశంసనీయమైనది. భవిష్యత్తులో అతడిని చూసి మేము గర్వపడతాం. యువ ఆటగాళ్లు ఇలా నిలబడడం చాలా మంచి విషయం" అని పంత్ పేర్కొన్నాడు.