LSG VS MI: ఐపీఎల్2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబయి ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. 204 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు బానే పోరాడిన చివర్లో కాస్త తడబడి పరాజయాన్ని అందుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67: 9 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ధీర్ (24 బంతుల్లో 46: 4 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగి ఆడారు. కానీ ముంబయి విజయానికి ఆఖరి ఓవర్లో 22 పరుగులు అవసరమయ్యా. కానీ ఆ సమయంలో 9 పరుగులే రావడంతో ఓటమి తప్పలేదు. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, దిగ్వేశ్, అవేశ్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. దిగ్వేశ్కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.
మ్యాచ్ మలుపు తిరిగింది అక్కడే...
వాస్తవానికి 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబయి జట్టుకు రెండో ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ఆకాశ్ దీప్ బౌలింగ్లో ఓపెనర్ విల్ జాక్స్ (5) పెవిలియన్ చేరాడు. రవిబిష్ణోయ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో రికెల్టన్ కూడా క్రీజుకు బై చెప్పాడు. కానీ వన్డౌన్లో బ్యాటింగ్ కు దిగిన నమన్ధీర్ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తర్వాత సూర్య కుమార్ యాదవ్ కూడా విజృంభించాడు. ఇద్దరు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో దిగ్వేశ్ వేసిన తొమ్మిదో ఓవర్ మొదటి బంతికి నమన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడు గా ఆడిన సూర్య కుమార్.. అవేశ్ఖాన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి అబ్దుల్ సమద్ చేతికి చిక్కాడు. దీంతో మ్యాచ్ కాస్త మలుపు తిరిగింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య.. మళ్లీ మంచి షాట్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో విజయం ముంబయిదే అవుతుందని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆఖరి రెండు ఓవర్లలో ముంబయి విజయానికి 29 పరుగులు అవసరమయ్యాయి. కానీ 19వ ఓవర్లో మొదటి ఐదు బంతులకు కేవలం ఐదు సింగిల్సే రావడంతో.. మ్యాచు ఉత్కంఠగా మారింది. అయితే తిలక్ వర్మ పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడి.. రిటైర్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి శాంట్నర్ వచ్చాడు. ఇక చివరి ఓవర్లో విజయానికి 22 పరుగులు అవసరం అయ్యాయి. మొదటి బంతికి హార్దిక్ సిక్స్ బాదాడు. రెండో బంతికి 2 పరుగులే వచ్చాయి. తర్వాతి నాలుగు బంతుల్లో కేవలం ఒక సింగిలే వచ్చింది. దీంతో ముంబయి విజయం అందుకోలేకపోయింది.
అదే ఓటమికి కారణం...
"ఓటమి కచ్చితంగా బాధేస్తుంది. నిరాశ కలిగిస్తుంది. మేము ఆటలో కొన్ని కీలక సమయాల్లో తప్పులు చేశాం. నిజంగా చెప్పాలంటే, మేము 10 నుంచి 15 పరుగులు అదనంగా ఇచ్చేశాము. ఈ స్థాయిలో ఆడేటప్పుడు అలాంటి పొరపాట్లు తీవ్రమైన ప్రభావం చూపుతాయి. నా బౌలింగ్ను నేను ఎప్పుడూ ఆస్వాదిస్తుంటాను. బౌలింగ్ విషయంలో నా దగ్గర ఎక్కువ ఆప్షన్లు ఉండవు. పిచ్ను అర్థం చేసుకుని, తెలివిగా బంతుల వేయడానికే ప్రయత్నిస్తాను. వికెట్లు తీయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లను. డాట్ బంతులు వేయాలని చూస్తాను. ఎందుకంటే అలా చేస్తే ఒత్తిడిలో బ్యాటర్లు తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాటింగ్లో మేము అనుకున్న స్థాయిలో పరుగులు చేయలేకపోయాం. గెలుపైనా ఓటమైనా - దాన్ని జట్టుగా తీసుకుంటాం. ఇది టీమ్ గేమ్. ఎవరినీ వ్యక్తిగతంగా తప్పు పట్టం. మొత్తం బ్యాటింగ్ యూనిట్ బాధ్యత తీసుకోవాలి. కానీ నేను కెప్టెన్గా ఆ బాధ్యతను పూర్తిగా తీసుకుంటాను. మాకు కొన్ని బిగ్ హిట్స్ అవసరమయ్యాయి. కానీ అది చేయలేకపోయం. అయితే క్రికెట్లో ఇలాంటి రోజులు వస్తుంటాయి. మనం ప్రయత్నించినా ఫలితం రాకపోవచ్చు. అందుకే, మంచి క్రికెట్ ఆడడమే ముఖ్యమని భావిస్తాను. నా శైలి సింపుల్గా ఉండటమే. సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. బౌలింగ్లో తెలివిగా ఉండాలి. బ్యాటింగ్లో రిస్క్ తీసుకోవాలి. కాస్త అగ్రెషన్తో(దూకుడుగా) సింపుల్ క్రికెట్ ఆడాలి. టోర్నమెంట్ లో ఇంకా చాలా మ్యాచులు ఉన్నాయి. మరో రెండు మూడు విజయాలు సాధించినా మేము తిరిగి గట్టిగా పుంజుకునే అవకాశం ఉంది. టీమ్గా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మళ్లీ గెలవడమంటే పెద్ద విషయం కాదు" అని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు.