లక్నో సూపర్ జెయింట్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్లో 160+ స్కోరును కాపాడుకుంటూ వస్తున్న ఏకైక జట్టుగా ఉన్న లక్నో రికార్డుకు ఢిల్లీ ఇవాళ చెక్ పెట్టింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5x4, 4x6) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్ (3/20) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అరంగేట్ర విదేశీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ (55; 35 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. రిషభ్ పంత్ (41; 24 బంతుల్లో, 4x4, 2x6) సత్తాచాటాడు. మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వివరించాడు. అలాగే యువ స్పీడ్గన్ మయాంక్ యాదవ్ గురించి మాట్లాడాడు.

మయాంక్ యాదవ్ బాగానే ఉన్నాడని, కానీ అతడి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నామని రాహుల్ చెప్పాడు. మరోవైపు తిరిగి బరిలోకి దిగాలని మయాంక్ ఉరకలేస్తున్నాడని రాహుల్ చెప్పాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మయాంక్ తుంటి నొప్పితో మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. అంతకుముందు అతడు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఈ పేస్ గుర్రం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో వేగవంతమైన బంతి విసిరిన ప్లేయర్గా సత్తాచాటాడు.
''మయాంక్ యాదవ్ బాగానే ఉన్నాడు. అయితే అతడిని మేం తొందరపెట్టాలని భావించట్లేదు. అతని శరీరాన్ని మేం రక్షించుకోవాలి. అతడు తిరిగి మైదానంలో అడుగుపెట్టడానికి ఉరకలేస్తున్నాడు. కానీ అతడు 100% ఫిట్నెస్తో ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాతే అవకాశం ఇస్తాం'' అని కేఎల్ రాహుల్ తెలిపాడు. ఈడెన్గార్డెన్స్ వేదికగా రేపు కోల్కతా నైట్ రైడర్స్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
మ్యాచ్ మధ్యలో వరుస ప్రయాణాలతో ఉన్న ఈ బిజీ షెడ్యూల్ గురించి రాహుల్ మాట్లాడాడు.''శనివారం లక్నో నుంచి కోల్కతాకు బయలుదేరాలి. ఆదివారం మధ్యాహ్నం కోల్కతా నైట్ రైడర్స్తో మాట్లాడాలి.షెడ్యూల్ ఇలా కొనసాగుతోంది. ఇది కాస్త మారాలి. భారత్లో వేసవిలో ఇది చాలా కష్టతరం'' అని రాహుల్ పేర్కొన్నాడు.