లక్నో సూపర్ జెయింట్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్లో 160+ స్కోరును కాపాడుకుంటూ వస్తున్న ఏకైక జట్టు లక్నో రికార్డుకు ఢిల్లీ ఇవాళ చెక్ పెట్టింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5x4, 4x6) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్ (3/20) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అరంగేట్ర విదేశీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ (55; 35 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. రిషభ్ పంత్ (41; 24 బంతుల్లో, 4x4, 2x6) సత్తాచాటాడు. మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను కేఎల్ రాహుల్ వివరించాడు. శుభారంభం సాధించినప్పటికీ కుల్దీప్ యాదవ్ మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పాడని రాహుల్ అన్నాడు. అలాగే అరంగేట్ర బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ కూడా తమ ఓటమికి కారణమయ్యాడని తెలిపాడు.

''మేం మరో 15-20 పరుగులు సాధించాలి. మాకు మంచి శుభారంభమే లభించింది. 180 పరుగులు సాధించేలా పునాది వేశాం. అయితే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కాస్త సహకరించింది. అంతేగాక బాల్ కొన్నిసార్లు తక్కువ ఎత్తులో వస్తోంది. దాన్ని కుల్దీప్ యాదవ్ గొప్పగా ఉపయోగించుకుని వికెట్లు సాధించాడు. అలాగే కొత్త కుర్రాడు జేక్ ఫ్రేజర్ గురించి మాకు పెద్దగా తెలియదు. అతడు భారీ షాట్లతో గొప్పగా ఆడాడు. క్రెడిట్ అతనికే దక్కాలి''
''విజయం సాధించాలనే బరిలోకి దిగాం. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయాలని భావించాం. పవర్ప్లేలో వార్నర్ను ఔట్ చేశాం. పవర్ప్లే ముగిసిన అనంతరం కూడా వికెట్ సాధించాం. కానీ జేక్ ఫ్రేజర్, పంత్ కుదురుకుని మ్యాచ్ను మాకు దూరం చేశారు. అక్షర్ పటేల్ ఓవర్ తర్వాత స్పిన్కు అంతగా అనుకూలించట్లేదని భావించాం. పూరన్ పంపించి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నాం. పూరన్కు క్రీజులో సెట్ అయితే ప్రమాదకరంగా మారతాడు. కానీ కుల్దీప్ పూరన్ను క్లీన్బౌల్డ్ చేశాడు'' అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.