వయసు మీద పడుతున్నా తన ఆటలో ఏ మాత్రం పదును తగ్గదని 42 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి నిరూపించాడు. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ సీఎస్కే మాజీ కెప్టెన్ మరో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. సహచర ఆటగాళ్లంతా 150 స్ట్రైక్రేటు సాధించడానికి చెమటోడుస్తుంటే ధోనీ మాత్రం సునాయాసంగా 300కు పైగా స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేశాడు.
18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ ఆది నుంచే బ్యాటు ఝుళిపించాడు. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్లో వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు. యశ్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో ఓ సిక్సర్, రెండు బౌండరీలు సాధించాడు. తొమ్మిది బంతుల్లో అజేయంగా 29 పరుగులు సాధించాడు. అయితే ఠాకూర్ బౌలింగ్లో ధోనీ తన ట్రేడ్ మార్క్ షాట్తో సిక్సర్ బాదాడు.

2011 వన్డ్ వరల్డ్ కప్ విన్నింగ్ షాట్ తరహాలోనే ధోనీ బంతిని స్టాండ్స్కు తరలించాడు. ఈ సిక్సర్ ఏకంగా 101 మీటర్ల దూరానికి చేరింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరో నెలన్నర రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్లో ధోనీ ఆడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ క్రమంలో ధోనీ ఐపీఎల్లో అయిదు వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అయిదు వేల పరుగులు సాధించిన తొలి వికెట్ కీపర్గా ధోనీ చరిత్ర సృష్టించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో, 5x4, 1x6)) టాప్ స్కోరర్. ఆఖర్లో ఎంఎస్ ధోనీ (28; 9 బంతుల్లో, 3x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అజింక్య రహానె (36; 24 బంతుల్లో, 5x4, 1x6), మొయిన్ అలీ (30; 20 బంతుల్లో, 3x6) ఆకట్టుకున్నారు. లక్నో బౌలరల్లో కృనాల్ పాండ్య (2/16) రెండు వికెట్లతో సత్తాచాటాడు.