
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్.. సూపర్బ్గా ఆడింది. గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. శరవేగంగా కోలుకుంది. తన రెండో మ్యాచ్లో టైటిల్ హాట్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ను మట్టి కరిపించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. బౌలర్లు చేతులెత్తేసినప్పటికీ లక్నో జెయింట్స్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఎవిన్ లెవిస్-55, ఓపెనర్ క్వింటన్ డికాక్- 61, ఓపెనర్ కమ్ కేప్టెన్ కేఎల్ రాహుల్, చివరిలో ఆయుష్ బదోని దెబ్బకు భారీ లక్ష్యం చిన్నబోయింది.
టైటిల్ హాట్ ఫేవరెట్గా సిరీస్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్కు ఇది ఊహించని పరాజయం. తొలి రెండు మ్యాచ్లల్లో ఓటమిపాలు కావడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదివరకెప్పుడూ ఇలాంటి సందర్భాన్ని చవి చూడలేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ టీమ్. తొలి మ్యాచ్లో కోల్కత నైట్ రైడర్స్ చేతిలో పరాభవాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. తన తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఎదుర్కొనబోతోంది. ఎల్లుండి సాయంత్రం 7:30 గంటలకు ముంబై బ్రబౌర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది.

లక్నో జెయింట్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. లక్నో జెయింట్స్ మెంటార్గా వ్యవహరిస్తోన్న టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్- మహేంద్రసింగ్ ధోనీను కలుసుకున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ సుదీర్ఘంగా సాగింది. బౌలర్ అవేష్ ఖాన్, ఇతర అంశాల గురించి వారిద్దరు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను గౌతమ్ గంభీర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్గా మారింది. వేలాది లైక్స్.. కామెంట్స్ పడ్డాయి దీని మీద. ఇద్దరూ లెజెండర్స్ కలిశారంటూ కామెంట్స్ చేశారు అభిమానులు.
ఎంఎస్ ధోనీ-గౌతమ్ గంభీర్ ఇద్దరూ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. 2011లో భారత క్రికెట్ జట్టు ఐసీసీ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులు. అప్పట్లో జట్టుకు ధోనీ కేప్టెన్. ధోనీ కేప్టెన్సీలో టీమిండియా ప్రపంచకప్ను గెలవడంలో గంభీర్ పాత్ర కీలకం. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 97 పరుగులు చేశాడు గంభీర్. అతనే టాప్ స్కోరర్. ధోనీ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 79 బంతుల్లో 91 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ కంటే ముందు ధోనీ-గంభీర్ చాలా మ్యాచ్లు ఆడారు. అప్పటి స్మృతులను నెటిజన్లు గుర్తు చేసుకున్నారు.