
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022 సీజన్లో చాలా మంది యువ ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. గతంలో 8 టీంలు మాత్రమే ఉండడంతో ఎందరో ప్లేయర్లు బెంచ్కే పరిమితమైపోయారు. కానీ ప్రస్తుత సీజన్లో కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేరడంతో చాలా మంది యువ ప్రతిభావంతులకు అవకాశాలు దక్కుతున్నాయి. అందులో కొందరు తమలోని అద్భుత ఆటను క్రికెట్ ప్రపంచానికి చూపిస్తున్నారు.
తాజాగా ఈ ఐపీఎల్లో వెలుగుచూసిన మరో యువ ప్లేయర్ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మొహ్సిన్ ఖాన్. నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ యువ కెరటం 3/24 ప్రదర్శనతో సత్తా చాటాడు. అయితే మొహ్సిన్ ఖాన్కు ఐపీఎల్లో అంత త్వరగా అవకాశాలు ఏం రాలేదు. కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టులో భాగమైన మొహ్సిన్ ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో తరఫున అరంగేట్రం చేశాడు.
ఉత్తర ప్రదేశ్లోని సంభాల్కు చెందిన మొహ్సిన్ను సూపర్ జెయింట్స్ మెగా వేలంలో అతని బేస్ ధర రూ.20లక్షలకే కొనుక్కుంది. తాజాగా నిన్న పంజాబ్పై లక్నో గెలిచిన అనంతరం.. ఐపీఎల్ వెబ్సైట్ కోసం దీపక్ హుడాతో సంభాషణలో మాట్లాడుతూ.. భావోద్వేగపూరితంగా స్పందించాడు. మొహ్సిన్ తన క్రికెట్ ప్రయాణాన్ని, చివరకు ఐపీఎల్లో అరంగేట్రం చేసి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చిన విషయాన్ని పంచుకున్నాడు. 'నేను గత మూడు సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నాను. అది చాలా పెద్ద జట్టు. నాకు మ్యాచ్లు ఆడే అవకాశమే రాలేదు.
కానీ నేను అక్కడ చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు లక్నో జట్టు నన్ను కొనుక్కుంది. ఈ జట్టు తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేయగలిగాను. ప్రస్తుతం మా జట్టు చాలా బలంగా ఉంది. ఈ జట్టులో సహాయక సిబ్బంది, మేనేజ్మెంట్ చాలా మద్దతుగా ఉన్నారు. నేను దేశవాళీ క్రికెట్లో ఎలా ఆడేవాడినో.. అలాగే ఇక్కడ కూడా స్వేచ్ఛగా ఆడాలని టీం మేనేజ్ మెంట్ చెప్పింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్లు నా బౌలింగ్ చూసి.. నాకు కొన్ని మెలకువలను నేర్పించారు. కష్టపడే నా విధానం నచ్చి నన్ను తుది జట్టులోకి తీసుకున్నారు.' అని మొహ్సిన్ తెలిపాడు.
'మూడేళ్ళుగా ఐపీఎల్లో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. నేను ఐపీఎల్ ఆడాలనేది నా తల్లిదండ్రుల డ్రీమ్. నేను ఎట్టకేలకు లక్నో తుది జట్టులో ఆడడంతో వారు చాలా సంతోషపడ్డారు. వారి కలను నెరవేర్చగలిగినందుకు నేను కూడా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఈ మ్యాచ్ ప్రదర్శనను నేను వారికి అంకితం చేస్తాను.' అని మొహ్సిన్ పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్పై జరిగిన మ్యాచ్లో మొహ్సిన్ 4ఓవర్లు వేసి ఒక మెయిడిన్తో పాటు 3వికెట్లు తీసి 24పరుగులే ఇచ్చాడు. అతని బౌలింగ్ ధాటికి ప్రమాదకర లియామ్ లివింగ్ స్టోన్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ లక్నో వైపు మలుపు తిరిగింది. తర్వాత చివర్లో రబాడాను, రాహుల్ చాహర్ను మొహ్సిన్ ఔట్ చేశాడు.