
అది అంతర్జాతీయ స్థాయిలో రెండు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్. భారీ స్కోర్లు నమోదవకపోయినా కనీసం స్కోర్లు నమోదవుతాయని అనుకుంటాం. కానీ ఈ మ్యాచ్ కేవలం రెండు బంతుల్లోనే పూర్తయితే? తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఐజిల్ ఆఫ్ మ్యాన్, స్పెయిన్ దేశాల మధ్య మ్యాజ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన స్పెయిన్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పర్యాటక జట్టు అయిన ఐజిల్ ఆఫ్ మ్యాన్ మొదట బ్యాటింగ్ చేసింది.
ఈ మ్యాచ్లో ఐజిల్ ఆఫ్ మ్యాన్ జట్టుకు శుభారంభం కాదు. అసలు ఎలాంటి శుభం జరగలేదు. తొలి బంతి నుంచే బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీనికి తోడు ఒక్కరంటే ఒక్కరు కూడా ఐదు పరుగులు కూడా చెయ్యలేదు. ఈ జట్టులో ఆరుగురు డకౌట్ అయ్యారు. ఓపెనర్ ఆడమ్ మెకాలీ (0) మ్యాచ్ తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు కూడా ఖాతా తెరవడానికి కష్టపడ్డారు. కేవలం నాలుగు పరుగులు చేసిన జోసెఫ్ బుర్రోస్ ఈ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. స్పెయిన్ బౌలర్లలో మహమ్మద్ కమ్రాన్, ఆతిఫ్ మెహమూద్ చెరో నాలుగు వికెట్లతో రాణించగా.. నాలుగు బంతులు మాత్రమే వేసిన లోర్నీ బర్న్స్ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఇంత దారుణంగా బ్యాటింగ్ చేసిన ఐజిల్ ఆఫ్ మ్యాన్ జట్టు ఈ మ్యాచ్లో 8.4 ఓవర్లు మాత్రమే ఆడింది. చివరకు కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక టీ20 క్రికెట్లో ఇంత తక్కువ స్కోరుకు ఒక జట్టు ఆలౌట్ అవడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ ఛేజింగ్లో స్పెయిన్ ఓపెనర్ అవైస్ అహ్మద్ తను ఎదుర్కొన్న రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదాడు. దీనికితోడు బౌలర్ జోసెఫ్ బుర్రోస్ ఒక నోబాల్ కూడా వేయడంతో కేవలం రెండు బంతుల్లోనే 13 పరుగులు చేసిన స్పెయిన్ ఈ మ్యాచ్ విజేతగా నిలిచింది. ఇంత త్వరగా మ్యాచ్ పూర్తవడం కూడా క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.