హైదరాబాద్: ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటిదే మరో బాలీవుడ్-క్రికెట్ లింకుతో మరో ప్రేమాయణం నడవనుందా? అనే అనుమానం అభిమానులకు కలిగింది.
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా మధ్య ట్విటర్ సంభాషణ ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఒక పార్కు పక్కన ఉంచిన సైకిల్ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసిన పరిణీతి.. 'అద్భుతమైన భాగస్వామితో కచ్చితమైన ప్రయాణం. ప్రేమ ఇప్పుడు గాలిలో తేలియాడుతోంది' అని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్కు హార్ధిక్ పాండ్యా బదులిచ్చాడు. 'పరిణీతి.. నేను ఊహించవచ్చా? నాకు తెలిసి ఇది బాలీవుడ్-క్రికెట్ లింక్ అయి ఉంటుంది. ఏదేమైనా మంచి ఫొటో' అని ట్వీట్ చేశాడు.
వెంటనే స్పందించిన చోప్రా 'హార్దిక్.. హహహ. కావొచ్చు. కాకపోవచ్చు. మొత్తానికి నేను చెప్పేది ఏమిటంటే ఆ ఫొటోలోనే క్లూ ఉంది' అని పేర్కొన్నది. దీంతో పరిణీతి చోప్రా, ఓ క్రికెటర్తో ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో పరిణీతి అనూహ్యంగా స్పందించింది. ఇదంతా కూడా తన కొత్త సెల్ ఫోన్ ప్రమోషన్లో భాగంగా చేసుకొచ్చానని పరిణీతి చెప్పుకొచ్చింది. ఆ పాట్నర్ ఎవరో కాదు తన కొత్త సెల్ఫోన్ Redmi 5X గురించి అని దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. Redmi 5Xతో తీసిన ఫోటో ఆకట్టుకునేలా ఉందని చెప్పింది.