
హైదరాబాద్: బంగ్లాదేశ్ జట్టులో మానసిక పరిపక్వత లోపించిందని ఆ జట్టు కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ పేర్కొన్నాడు. ఆప్ఘనిస్థాన్తో జరిగిన మూడు టీ20ల సిరిస్లో బంగ్లాదేశ్ వైట్వాష్ గురైన సంగతి తెలిసిందే. గురువారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20లో ఆప్ఘనిస్థాన్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
బంగ్లా విజయానికి చివరి 2 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా... 19వ ఓవర్లో ముష్ఫికర్ రహీమ్ (46) వరుసగా ఐదు ఫోర్లు బాది మొత్తం 21 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన రషీద్ ఖాన్ తొలి బంతికే రహీమ్ను ఔట్ చేయడంతో పాటు ఏడు పరుగులిచ్చి జట్టుని గెలిపించాడు.
దీంతో మూడు టీ20ల సిరిస్ను ఆప్ఘనిస్థాన్ క్లీన్ స్వీస్ చేసింది. మ్యాచ్ అనంతరం షకీబ్ ఉల్ హాసన్ మాట్లాడుతూ "సిరీస్ ఓటమిపై సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంది. నేను గతంలో ఎప్పుడూ ఈ తరహా పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయలేదు. మా జట్టులో బౌలర్ అయినా, బ్యాట్స్మెన్ అయినా వారి వారి ప్రదర్శనపై పునరాలోచించుకోవాలి" అని అన్నాడు.
"మా జట్టులో మానసిక పరిపక్వత లోపించినట్లు కనబడింది. మొత్తంగా మా ప్రదర్శనతో సిరీస్ గెలిచే అర్హత లేదనేది అర్థమైంది. మూడు విభాగాల్లోనూ పూర్తిగా విఫలయమ్యాం. అప్ఘనిస్తాన్ పరిస్థితులకు తగ్గట్టు ఆడింది. అప్ఘనిస్థాన్ జట్టులో రషీద్ ఖాన్ కీలక ఆటగాడు. అతను మ్యాచ్లను గెలిపించిన తీరు అమోఘం" అని తెలిపాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. షెన్వారి (33 నాటౌట్) టాప్స్కోరర్గా నిలిచాడు. అనంతరం 146 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 144 పరుగులు మాత్రమే చేసి ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది.