హైదరాబాద్: తొలి 10 ఓవర్లలోనే మూడు వికెట్లను చేజార్చుకోవడమే పూణె వన్డే ఓటమికి కారణమని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం శాంట్నర్ మీడియాతో మాట్లాడుతూ 'నిజంగా చాలా నిరాశకు గురి చేసింది. క్రెడిట్ అంతా భారత బౌలర్లదే. మ్యాచ్ అరంభంలో మూడు వికెట్లు తీసి మా జట్టుని తీవ్ర ఒత్తడిలోకి నెట్టారు' అని అన్నాడు.
రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ను భారత బౌలర్లు స్వల్ప స్కోర్లకే కట్టడి చేసిన సంగతి తెలిసిందే. స్లో పిచ్ కావడం, పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించడంతో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా వరుసగా మార్టిన్ గప్తిల్ (11), విలియమ్సన్ (3), కోలిన్ మున్రో (10) వికెట్లను తీశారు.

దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 27 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడంతోనే ఎక్కువ స్కోరుని భారత్ ముందు ఉంచలేకపోయామని, ఇదే కివీస్ విజయావకాశాల్ని దెబ్బతీసిందని శాంట్నర్ అన్నాడు.
'టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు తొలి 10 ఓవర్లలోనే మూడు ప్రధాన వికెట్లను చేజార్చుకుంటే, తిరిగి మ్యాచ్లో పుంజుకోవడం చాలా కష్టం. పూణె వన్డే ఆరంభంలోనే 27/3తో మా జట్టు ప్రదర్శన చాలా నిరాశ కలిగింది. ఇక్కడ ఘనత అంతా భారత పేసర్లకే దక్కాలి. పదునైన బౌలింగ్తో వారు కివీస్ని ఒత్తిడిలోకి నెట్టారు' అని తెలిపాడు.
'దీంతో కివిస్ 230 పరుగులకే పరిమితమైంది. ఇక్కడే దాదాపు మ్యాచ్ చేజారినట్లే. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ చివరి వరకూ క్రీజులో నిలిచి కివీస్కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జట్టుకు విజయాన్ని అందించాడు' అని శాంట్నర్ వివరించాడు.
తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్ని భారత్ 1-1తో సమం చేసింది. ఈ సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది. వన్డే సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య నవంబర్ 1 నుంచి మూడు టీ20ల సిరిస్ ఆరంభం కానుంది.