

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా రెండో రోజు ప్రారంభమైన టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. అండర్సన్ ఏడో ఓవర్ వేయడానికి రాగానే వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత చినుకులు మరింత జోరందుకోవడంతో 6.3వ బంతికి అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.
వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 11/2తో ఉంది. రెండో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ మురళీ విజయ్ వికెట్ను కోల్పోయింది. అండర్సన్ తన స్వింగ్ బౌలింగ్తో మురళీ విజయ్ను పెవిలియన్కు చేర్చాడు.
జేమ్స్ ఆండర్సన్ వేసిన అద్భుత బంతికి విజయ్ డకౌట్గా వెనుదిరిగాడు. తొలి ఓవర్ నాలుగు బంతులను చాకచక్యంగా ఎదుర్కొన్న విజయ్.. అదే ఓవర్లో ఐదో బంతికి ఓపెనర్ మురళీ విజయ్ డకౌటయ్యాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా కూడా తెరకుండానే తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత ఇన్నింగ్స్ 6.1వ బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్ (8;)ను ఔట్ చేశాడు. రెండు ఫోర్లు కొట్టి ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నట్లే కనిపించిన రాహుల్ కీపర్ బెయిర్స్టో చేతికి క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(1) పుజారా(1) పరుగులతో ఉన్నారు. తొలి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా ఆట పూర్తిగా రద్దయింది.
ఇక, శుక్రవారం కూడా ఆట ఆరంభంలోనే వర్షం మ్యాచ్కు అడ్డంకిగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.