
లార్డ్స్: టీమిండియా కొంచెం కష్టపడితే చాలు లార్డ్స్ మైదానంలో రాణించేయొచ్చు. ఈ విషయాన్ని స్టేడియం గణాంకాలే చెబుతున్నాయి. ఇంగ్లాండ్, భారత్ మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిన భారత్.. ఈ టెస్టులో ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. మొదటి టెస్టు వైఫల్యాన్ని అధిగమించాలని జట్టులో మార్పులు చేసుకోనుంది టీమిండియా.
ఈ క్రమంలో.. జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించే అవకాశం ఉండటంతో.. తొలి టెస్టులో పక్కనబెట్టిన పుజారాను లార్డ్స్ టెస్టులో ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వేదికపై భారత్ ఇప్పటి వరకూ 17 టెస్టులు ఆడగా కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్లు డ్రాగా ముగించుకొని 11 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది.
పరవాలేదనిపించుకున్న ఆసియా జట్లు:
లార్డ్స్ వేదికగా ఆసియా దేశాలతో గతంలో జరిగిన చివరి ఐదు టెస్టుల్లో ఇంగ్లాండ్ గెలవలేకపోయింది. పాక్, భారత్ చేతుల్లో ఓడిన ఆతిథ్య జట్టు.. శ్రీలంకతో రెండు టెస్టులను డ్రా చేసుకుంది. భారత బ్యాట్స్మెన్ కొంచెం కష్టపడితే ఈ పిచ్ మీద విజయం సాధించే అవకాశాలు బాగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఇంగ్లాండ్ జట్టు 2010 జనవరి నుంచి ఇప్పటి వరకూ లార్డ్స్లో మూడుసార్లు 200 పరుగుల్లోపు ఆలౌట్ అయ్యింది.
ఎడ్జ్బాస్టన్లో ఆసియా జట్టేది గెలుపొందలేదనే ఆనవాయితీ మరోసారి నిజమైంది. తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది. మరి లార్డ్స్లో ఇటీవల ఆసియా జట్లకు తిరుగులేని రికార్డ్ ఉండగా.. దాన్ని కూడా కోహ్లి సేన కొనసాగిస్తుందేమో వేచి చూడాల్సిందే.