సౌతాంప్టన్: రెండు పరాజయాల అనంతరం ఇంగ్లాండ్తో మూడో టెస్టులో విజయం సాధించింది టీమిండియా. ఆ సంతోషంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీసమేతంగా సరదాగా గడుపుతున్నాడు. నాలుగో టెస్టుకు ఇంకా సమయం ఉండటంతో తన భార్య అనుష్కశర్మతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. సోషల్మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటున్నాడు.
ఇటీవల ఓ బ్యూటిఫుల్ బాయ్ను కలిసినట్లు విరుష్క జంట తెలిపింది. తాము కొత్త స్నేహితుడిని కలిశామంటూ.. అందుకు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్లో విరాట్ షేర్ చేశాడు. ఇంతకీ ఆ బ్యూటిఫుల్ బాయ్ ఎవరో తెలుసా?. ఓ శునకం. శునకాలంటే కోహ్లీ, అనుష్కకి ఎంత ఇష్టమో తెలిసిందే. దీంతో మూడో టెస్టు అనంతరం కోహ్లీ, అనుష్క ఇంగ్లాండ్లో ఓ శునకంతో ఫొటో దిగారు. 'బ్యూటిఫుల్ బాయ్ను మేం కలిశాం. మాతో ఫొటో దిగడానికి దానికి ఎంతో ఓపిక ఉంది' అంటూ క్యాప్షన్ పెట్టాడు కోహ్లీ. ఈ ఫొటో నెట్టింట్లో వైరల్గా మారింది.
Met this beautiful boy who was patient enough to take a picture with us 😍🐶 pic.twitter.com/Uu2AyiZCfn
— Virat Kohli (@imVkohli) August 24, 2018
ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో భర్తతో కలిసి అనుష్క కూడా అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కోహ్లీని ప్రోత్సహిస్తూ మైదానంలో పలుసార్లు అనుష్క కనిపించారు. మూడో టెస్టులో విరాట్ సెంచరీ నమోదు చేసిన సమయంలో భార్యకు ముద్దులు విసురుతూ కనిపించడమే దానికి నిదర్శనం. భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు ఈ నెల 30న ప్రారంభంకానుంది. మూడు టెస్టులు ముగిసే సరికి భారత్ 1-2తో వెనుకంజలో ఉంది.
మూడో టెస్టులో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ తొలి టెస్టులో చేసినట్లుగానే మళ్లీ 200 పరుగులు నమోదు చేశాడు. దీంతో అతనికి వచ్చి చేజారిపోయిన టెస్టు ర్యాంకింగ్స్ మళ్లీ దక్కినట్లు అయింది. ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ ఆటతీరును చూసి భారత సీనియర్ క్రికెటర్లతో పాటుగా విదేశీ క్రికెటర్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుతో పోరాడేందుకు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసేసింది.