
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరోసారి తన మద్దతుని ప్రకటించాడు. కెప్టెన్గా రెండు ప్రపంచకప్లు అందించిన ధోనీని విమర్శించే వాళ్లు... తమ కెరీర్ను ఓసారి పరిశీలించుకోవాలని రవిశాస్త్రి విమర్శించాడు. కివీస్తో టీ20 సిరీస్ సందర్భంగా లక్ష్మణ్, అగార్కర్ వంటి మాజీ ఆటగాళ్లు ధోని టీ20 భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే.
'ధోనీని విమర్శించే వాళ్లు ఓసారి వెనక్కి తిరిగి తమ కెరీర్ను చూసుకోవాలి. ధోనీలో ఇంకా చాలాకాలం క్రికెట్ ఆడగల సామర్థ్యం ఉంది. ఓ దిగ్గజానికి మద్దతు ఇవ్వడం జట్టు బాధ్యత. నైపుణ్యం, ప్రదర్శనపై ప్రస్తుత జట్టు ఆధారపడిఉంది. ధోనీ కంటే మెరుగైన బ్యాట్స్మన్, వికెట్ కీపర్ లేడు. మైదానంలో అతని చురుకుదనం, సమయస్ఫూర్తి అమోఘం' అని రవిశాస్త్రి చెప్పాడు.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఆటతీరు, సమానత్వం అనే సంస్కృతి నెలకొని ఉందని అన్నారు. ఫీల్డింగ్లో ఇప్పుడున్న జట్టు అత్యుత్తమైందని కొనియాడాడు. ఇక శ్రీలంకతో గురువారం నుంచి ఆరంభమయ్యే సిరిస్లో విజయం సాధిస్తామని రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంపై కూడా రవిశాస్త్రి స్పందించాడు.
జట్టు గెలుపోటముల్లో అందరిది సమిష్టి బాధ్యత అని రవిశాస్త్రి చెప్పాడు. ఇదిలా ఉంటే, భారత్ జట్టు ప్రాక్టీస్ అనంతరం రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్తో కలిసి కోల్కతాలోని ఫనాటిక్ స్పోర్ట్స్ మ్యూజియంను సందర్శించాడు. మ్యూజియంలో ఉన్న డాన్ బ్రాడ్మన్ బ్యాట్ను చూసి ముగ్దుడయ్యాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు' ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.