
హైదరాబాద్: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో మరో టెస్టు మిగిలుండగానే 0-2తో ఓటమి పాలై కోహ్లీసేన సిరిస్ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీసేన చెత్త ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మద్దతుగా నిలిచాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో బ్యాట్స్మెన్ విఫలమైనప్పటికీ, బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు. కోహ్లీసేన సిరీస్ కోల్పోయిన సమయంలో కేవలం నెగిటివ్ విషయాల్ని మాత్రమే ప్రస్తావించకుండా, మన జట్టులో పాజిటివ్ కోణాన్ని కూడా చూడాలని ధోని ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా కనీసం డ్రా కోసం యత్నిస్తే బాగుండేదని వస్తున్న వ్యాఖ్యలపై కూడా ధోని స్పందించాడు. ఒక టెస్టు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లూ సాధించాలని, అది మన బౌలర్లు చేసి చూపించారని అలాంటి సమయంలో డ్రా కోసం యత్నించడం వేస్ట్ అని ధోని అన్నాడు.
'నేను ఇక్కడ ఒక్క విషయం మాత్రమే చెప్పదలుచుకున్నా. సఫారీ పర్యటనలో భారత జట్టు సానుకూలంగా ముందుగా సాగుతుంది. ఒక టెస్టు మ్యాచ్లో విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయాలి. అది మనం చేసి చూపించాం. ఒకవేళ 20 వికెట్లు తీయలేని పక్షంలో తదుపరి పరిణామం ఏమిటి అని ఆలోచించాలి. అప్పుడే డ్రా కోసం యత్నించాలి' అని శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ తరపున చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధోని అన్నాడు.
'20 వికెట్లు సాధించిన క్రమంలో డ్రా కోసం ఎందుకు ఆడాలి. స్కోరు బోర్డుపై తక్కువ పరుగులున్నా, భారీగా పరుగులున్నా మొత్తం వికెట్లు తీయలేనప్పుడే డ్రా కోసం ఆడాల్సి ఉంటుంది. 20 వికెట్లు తీయలేనప్పుడు స్వదేశంలోనైనా, విదేశంలోనైనా టెస్టు మ్యాచ్ గెలవలేం. మన బౌలర్లు 20 వికెట్లు సాధించినప్పుడు గెలుపుకు అన్ని విధాలా అర్హత ఉందని అర్ధం. ఆ క్రమంలో ఓటమి ఎదురైతే విమర్శలతో దాడి చేయడం సరికాదు' అని ధోని అన్నాడు.
ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ప్రభావం చూపబోవని ధోని ఈ సందర్భంగా తెలిపాడు. 'సీఎస్కే జట్టులో తప్ప మరో ఫ్రాంఛైజీకి ఆడాలనే ఆలోచన నాకు ఎన్నడూ రాలేదు. చెన్నై నాకు మరో ఇల్లు. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. ఈ ఐపీఎల్ సీజన్లో సత్తా చాటి తీరతాం. ఫిక్సింగ్ ఆరోపణలు మా బ్రాండ్పై ఎలాంటి ప్రభావం చూపించవు' అని ధోని అన్నాడు.