
హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్తో నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి రిషబ్ పంత్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారం నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం రెండో రోజైన శుక్రవారం భారత్ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది.
దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో పంత్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. 47వ ఓవర్లో బెన్ స్టోక్స్ వేసిన బౌలింగ్లో రహానే ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్లో ఉన్న పుజారాతో కలిసి పంత్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు.
ఈ క్రమంలో 29 బంతులాడిన రిషబ్ పంత్ ఒక్క పరుగు కూడా చేయలేదు. 57వ ఓవర్లో మొయిన్ అలీ బౌలింగ్లో రిషబ్ పంత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో పంత్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 29 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయని బ్యాట్స్మెన్లు జాబితాలో పంత్ చోటు దక్కించుకున్నాడు.
ఈ జాబితాలో సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్తో కలిసి సంయుక్తంగా చోటు దక్కించుకున్నాడు. 2014-15 సీజన్లో పాకిస్థాన్తో జరిగిన ఓ టెస్టులో ఇర్ఫాన్ పఠాన్, 2011లో ఇంగ్లాండ్తో జరిగిన ఓ టెస్టులో సురేశ్ రైనా ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్కు చేరుకున్నారు.
ఇదిలా ఉంటే, నాలుగో టెస్టులో పుజారా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు సెంచరీతో జట్టుని ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులకి ఆలౌటైంది. తద్వారా తొలి ఇన్నింగ్స్లో కోహ్లీసేన 27 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 246 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.