హైదరాబాద్: ఒలింపిక్స్ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లండన్ ఒలింపిక్ స్టేడియం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. 2019లో ఇంగ్లాండ్లో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్కు లండన్ ఒలింపిక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవలే లండన్ ఒలింపిక్ స్టేడియాన్ని పరిశీలించింది.
వన్డే మ్యాచ్లు నిర్వహించేందుకు అనుకూలంగా కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని స్టేడియం నిర్వాహకులకు సూచించింది. దీనిపై త్వరలోనే ఐసీసీ ఓ ప్రకటన చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. 2019 వరల్డ్ కప్కు కొత్త ప్రేక్షకులను ఆకర్షించడంతో పాటు క్రికెట్ వైభవాన్ని చాటి చెప్పేందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా 2019 వరల్డ్ కప్లో మూడు నుంచి నాలుగు మ్యాచ్లను ఈ స్టేడియంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అన్నీ కుదిరితే ఈ స్టేడియంలో వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలు నిర్వహిస్తామని ఐసీసీ తెలిపింది. కాగా, లండన్ ఒలింపిక్ స్టేడియం సామర్థ్యం విషయానికి వస్తే 60,000.
లండన్లో సాధారణంగా క్రికెట్ స్టేడియాల సామర్థ్యం 30వేల వరకు ఉంటుంది. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే వరల్డ్ కప్ మ్యాచ్లకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఐసీసీ అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, ఈడెన్ పార్క్ స్టేడియాల మాదిరి లండన్ ఒలింపిక్ స్టేడియాన్ని కూడా వినియోగించుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి ఐసీసీ వచ్చింది. చివరిసారిగా 1999లో ఇంగ్లాండ్లో వరల్డ్ కప్ పోటీలు జరిగాయి.