న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లను తొలగించాలంటూ జస్టిస్ లోథా కమిటీ సోమవారం (నవంబర్ 21)న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ లోథా కమిటీ తాజా నిర్ణయంతో బీసీసీఐ, లోథా కమిటీల మధ్య వివాదం మరింతగా ముదిరింది.
బీసీసీఐ పరిశీలకుడిగా బాధ్యతలను హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైకి అప్పగించాలని తన నివేదికలో పేర్కొంది. దాంతో పాటు పిళ్లైకు ఆడిటర్ను, ఇతర పరిపాలనా సిబ్బందిని నియమించడం, వారి జీత భత్యాలు నిర్ణయించే అధికారం ఇవ్వాలని లోధా కమిటీ తన నివేదికలో పేర్కొంది.
బీసీసీఐకి ఆడిటర్లను నియమించే బాధ్యతతో పాటు, తదుపరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రచార హక్కుల అంశాన్ని పరిశీలిస్తారని జిస్టిస్ లోథా కమిటీ దాఖలు చేసిన పిటిషన్లో కోర్టుకు తెలిపింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్తో పాటు ఆఫీస్ బేరర్లు చేసే సూచనలను బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ అంగీకరించకూడదని లోథా కమిటీ స్పష్టం చేసింది.

లోథా కమిటీ చేసిన పలు సూచనలపై బీసీసీఐ తేల్చిచేప్పింది. ఈ నేపథ్యంలో లోథా కమిటీ సంస్కరణలను అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, 13 రాష్ట్ర సంఘాలకు గత నెలలో డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చింది.
తాజాగా బోర్డులో సంస్కరణలకు మరిన్ని కొత్త సిఫారసులను సోమవారం సుప్రీంకోర్టుకు తన నివేదికలో అందజేసింది. ఆ నివేదికలో ప్రస్తుతం బీసీసీఐ ఆఫీస్ బేరర్లను ఉన్న సభ్యులందరినీ తొలగించాలని సుప్రీం కోర్టును కోరింది.