ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ)పై లోధా కమిటీ సంచలన ఆరోపణలు చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు ఏర్పాటైన జస్టిస్ లోథా కమిటీ బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై మండిపడింది. అంతేగాక, యువ ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయాలంటే తమ లైంగిక వాంఛ తీర్చాలని సెలెక్టర్లు కోరుతున్నారని లోథా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర నారాయణన్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఆగస్టు 9న లోథా ప్యానెల్తో జరిగిన సమావేశంలో శంకర్ నారాయణన్ సెలెక్టర్లపై ఈ నిందారోపణలు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. సెలెక్టర్లు చేస్తున్న అవినీతి, అక్రమాలపై బీసీసీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కూడా నారాయణన్ అన్నట్టు షిర్కే బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్కు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు.
లోథా ప్యానెల్ ముందు ఆగస్టు 9న బీసీసీఐ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆ సమయంలో పార్లమెంటు సమావేశాలు ఉండడంతో ఎంపీ అయిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
బోర్డు తరఫున కార్యదర్శి అజయ్ షిర్కే ఒక్కరే హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి 14 పాయింట్ల నివేదికను షిర్కే బీసీసీఐ అధ్యక్షుడికి పంపారు. సమావేశం కొద్దిసేపట్లో ముగుస్తుందనగా శంకర నారాయణన్ సెలెక్టర్ల వ్యవహారాన్ని లేవనెత్తినట్టు షిర్కే పేర్కొన్నారు.

'ఔత్సాహిక యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలంటే వారి తల్లులను తమ లైంగిక వాంఛ తీర్చాలని సెలెక్టర్లు కోరుతున్నారు. వారు అనైతిక, అక్రమాలకు పాల్పడుతున్నా.. బీసీసీఐ మౌన ప్రేక్షకుడిలా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సెలెక్టర్లు తప్పు చేస్తున్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు' అని శంకర నారాయణన్ చెప్పినట్టు షిర్కే మెయిల్లో వివరించారు.
బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో నైతిక విలువలు దిగజారిపోయాయని కూడా ఆయన అన్నట్టు షిర్కే చెప్పారు. అయితే ఈ ఆరోపణలను తాను ఖండించానని షిర్కే తెలిపారు. ఈ ఆరోపణలు తమను బాధించాయని అన్నారు. బీసీసీఐ చరిత్రలో ఇలాంటివి జరిగినట్టు ఎప్పుడూ తమ దృష్టికి రాలేదని నారాయణన్తో చెప్పినట్టు తన నివేదికలో ఆయన వెల్లడించారు.
కాగా, సెలెక్టర్లందరూ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారంటూ నారాయణన్ చేసిన ఆరోపణలు వాస్తవం దూరమని, అర్థరహితమైనవని షిర్కే చెప్పారు. అయితే, దీనిపై స్పందించేందుకు శంకర నారాయణన్ నిరాకరించారు.