హైదరాబాద్: బీసీసీఐలో లోధా సంస్కరణ అమలుతో పాటు మిగతా సమస్యలపై మార్చి 24 (శుక్రవారం)న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. బీసీసీఐ, అనుబంధ సంఘాల్లో జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సంస్కరణల అమలు, రైల్వేస్, సర్వీసెస్, భారత విశ్వవిద్యాలయాల సంఘం ఓటు హక్కుల పునరుద్ధరణ తదితర అంశాలపై సుప్రీం విచారణ చేయనుంది.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు బీసీసీఐకి సంబంధించిన కొన్ని అంశాలపై వాదించేందుకు తనకు రెండు గంటల సమయం అవసరమని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంను కోరారు.

సోమవారం సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ అంత్యక్రియలకు హాజరు కావాలని విచారణను మరో రోజుకు వాయిదా వేయాలని బీసీసీఐ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఈ నేపథ్యంలో మార్చి 24కు విచారణను వాయిదా వేశామని జస్టిస్ మిశ్రా తెలిపారు.