సిడ్నీ: స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్కు కరోనా వైరస్ (కొవిడ్-19) వైరస్ లక్షణాలు కనిపించడంతో వణికిపోయిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ఈ రోజు వచ్చిన రిపోర్టులో ఫెర్గూసన్కు కరోనా వైరస్ నెగిటివ్ అని తేలింది. దీంతో ఫెర్గూసన్తో పాటు కివీస్ జట్టుకు భారీ ఉపశమనం లభించింది. గొంతులో మంటగా అనిపిస్తోందని చెప్పడంతో ఫెర్గూసన్కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
'టీమిండియాలో పునరాగమనం చేయాలన్న ఆకలితో ఉన్నా.. ఈ కసి గతంలో ఎప్పుడూ లేదు'
ఆస్ట్రేలియాతో తొలి వన్డే తర్వాత లాకీ ఫెర్గూసన్ విపరీతమైన గొంతు మంటతో సతమతమయ్యాడు. దీంతో అప్రమత్తమైన కివీస్ జట్టు వెంటనే అతడిని ప్రత్యేక వార్డుకు చేర్చింది. జట్టు బస చేసిన హోటల్లోనే అతన్ని ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేశారు. 24 గంటల తర్వాత ఫెర్గూసన్కు సాధారమైన గొంతు నొప్పి అని రిపోర్ట్లో తేలింది. ఫలితంగా అతను యథావిధిగా జట్టుతో కలవనున్నాడు. కరోనా వైరస్ సోకలేదని తేలడంతో ఫెర్గూసన్తో పాటు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు భారీ ఊరట దక్కింది.
తొలి వన్డేకు ముందు ఆసీస్ పేసర్ కేన్ రిచర్డ్సన్ సైతం గొంతు నొప్పితో బాధపడ్డాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెంటనే అతనికి కరోనా పరీక్షలు చేయించింది. అతడికి నెగెటివ్ అని రిపోర్ట్ రావడంతో జట్టు సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. రిచర్డ్సన్కు గొంతు నొప్పి ఉడడంతో శుక్రవారం కివీస్తో జరిగిన తొలి వన్డేకు దూరమయ్యాడు. రిచర్డ్సన్కు బదులు సీన్ అబాట్ను సీఏ ఎంపిక చేసింది. అయితే టెస్టుల అనంతరం రిచర్డ్సన్ మైదానానికి వెళ్ళాడు.
కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దయింది. ఇప్పటికే శుక్రవారం తొలి వన్డే ఆడిన ఇరు జట్లు మిగతా రెండు మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టే వారిని కచ్చితంగా 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని ఆ దేశం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంక్షలు అమలయ్యే ముందే స్వదేశానికి తరలిపోవాలని కివీస్ క్రికెటర్లు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వన్డే సిరీస్ తర్వాత న్యూజిలాండ్లో ఆడాల్సిన టీ20 సిరీస్ కూడా రద్దైనట్లే.