24 గంటల పర్యవేక్షణలో ఫెర్గూసన్:
సిడ్నీ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అనంతరం ఫెర్గూసన్ గొంతు నొప్పి ఉందని చెప్పడంతో.. కివీస్ జట్టు యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. జట్టు బస చేసిన హోటల్లో ఫెర్గూసన్ను ప్రత్యేకంగా ఉంచినట్లు కివీస్ జట్టు ప్రతినిధి మీడియాకు చెప్పారు. 24 గంటల పాటు అతడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలిపారు. కరోనా పరీక్ష ఫలితాలు వచ్చాక ఫెర్గూసన్ను మ్యాచ్లలో కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
రిచర్డ్సన్కు కూడా గొంతు నొప్పి:
తొలి వన్డేకు ముందు ఆసీస్ పేసర్ కేన్ రిచర్డ్సన్ సైతం గొంతు నొప్పితో బాధపడ్డాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెంటనే అతనికి కరోనా పరీక్షలు చేయించింది. అతడికి నెగెటివ్ అని రిపోర్ట్ రావడంతో జట్టు సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. రిచర్డ్సన్కు గొంతు నొప్పి ఉడడంతో శుక్రవారం కివీస్తో జరిగిన తొలి వన్డేకు దూరమయ్యాడు. రిచర్డ్సన్కు బదులు సీన్ అబాట్ను సీఏ ఎంపిక చేసింది. అయితే టెస్టుల అనంతరం రిచర్డ్సన్ మైదానానికి వెళ్ళాడు.
కరచాలనం చేసుకోలేదు:
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కివీస్తో వన్డే సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రేక్షకులను అనుమతించట్లేదు. దీంతో ఖాళీ స్టేడియంలోనే శుక్రవారం ఇరు జట్లు తలపడ్డాయి. తొలి వన్డేలో ఆసీస్ 71 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. ఇక టాస్ వేసిన తర్వాత ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కరోనా గుర్తుకురావడంతో వెంటనే ఫించ్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. దీంతో ఇరు జట్ల కెప్టెన్ల ముఖాలలో నవ్వు వెల్లివిరిసింది. తర్వాత విలియమ్సన్, ఫించ్లు తమ మోచేతులతో ట్యాప్ చేసుకున్నారు. ఈ చిత్రాలు సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.