

హైదరాబాద్: పర్యటనలో ప్రాక్టీసు మ్యాచ్లు కింద భావించిన టీమిండియా బ్యాట్స్మెన్ అనుకున్నంత పని చేశారు. ఐర్లాండ్ను 2-0తేడాతో క్లీన్ స్వీప్కు గురి చేశారు. తొలి టీ20లో 76 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఏకంగా 143 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ని 2-0తో చేజిక్కించుకుంది.
తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్సులు(70), సురేశ్ రైనా 45 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సులు (69), హార్దిక్ పాండ్య 9 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో (32) నాటౌట్లతో మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ జట్టు మరోసారి భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/16), చాహల్ (3/21) ధాటికి చేతులెత్తేసింది. క్రమం తప్పకుండా స్పిన్నర్లు వికెట్లు తీయడంతో ఆ జట్టు 12.3 ఓవర్లలో 70 పరుగులకే పేకమేడలా కుప్పకూలిపోయింది. ఆ జట్టులో ఏడు మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమవగా.. అందులో ముగ్గురు డకౌటవడం విశేషం. ఇక భారత జట్టు జూలై 3 నుంచి ఇంగ్లాండ్తో మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.
దూకుడుగా సాగి, పరుగుల వరద పారించిన టీమిండియా:
ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. వరుస బౌండరీలు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించారు. ముందుగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (70), వన్డౌన్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా(69) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, చివర్లో పాండ్య 9 బంతుల్లో (32) మెరిపించడంతో భారత్ నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బౌలర్లలో కెవిన్ ఓబ్రైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ బౌలర్ సిమి సింగ్ వేసిన 11ఓవర్లో రాహుల్ రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాది అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత కూడా జోరు కొనసాగించిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ కెవిన్ ఓబ్రైన్ వేసిన 12.1బంతికే అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రోహిత్ కూడా ఖాతా తెరవకుండానే అదే ఓవర్లో మూడో బంతికి వెనుదిరగడంతో ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యత రైనా తీసుకున్నాడు.
మనీశ్పాండే(21)తో ఇన్నింగ్స్ కొనసాగించిన రైనా ఓబ్రైన్ వేసిన 14.5 బంతిని బౌండరీగా మలిచి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. కానీ ఓబ్రైన్ వేసిన 18ఓవర్లోనే రైనా(69)) డాకర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో పాండ్య బ్యాట్ ఝళిపించడంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ:
ఐపీఎల్లో సత్తా చాటిన కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలో దిగి ఆతిథ్య బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన ట్రేడ్మార్క్ బ్యాటింగ్తో పరుగుల వరద పారించాడు. ఓపెనర్గా దిగి ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న రాహుల్ కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 101/1
తొలి మ్యాచ్ విజయాన్ని కొనసాగించాలనే విజయోత్సాహంతో బరిలోకి దిగిన టీమిండియా మొదటి మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి కెప్టెన్ కోహ్లీ వికెట్ను కోల్పోయింది. ఇంతకుముందు మ్యాచ్లోనూ సున్నా పరుగులతో వెనుదిరిగిన కోహ్లీ.. ఈ మ్యాచ్లో పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 8బంతులు ఆడి 9 పరుగులు చేశాడు. దీంతో ఓపెనర్గా దిగిన రాహుల్కు చక్కని భాగస్వామ్యాన్ని కల్పించలేకపోయాడు. ఈ క్రమంలో కోహ్లీ స్థానంలో సురేశ్ రైనా బ్యాటింగ్ దిగాడు. రైనా, రాహుల్లు కలిసి 92 పరుగుల స్కోరు చేయగలిగారు. పదో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేయగలిగింది. క్రీజులో రాహుల్( 47), రైనా(39) ఉన్నారు.
టాస్ రిపోర్టు:
ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20లో అలవోక విజయాన్ని అందుకున్న టీమిండియా విజయోత్సాహంతో బరిలోకి దిగనుంది. ఐర్లాండ్లోని డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ భారత్ జట్లు తలపడనున్నాయి.
మరోవైపు తొలి టీ20లో బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు బ్యాటింగ్లోనూ ఘోరంగా విఫలమైన ఐర్లాండ్ జట్టు.. కనీసం రెండో టీ20లోనైనా పోటీనివ్వాలని ఆశిస్తోంది. తొలి టీ20లో భారత తుది జట్టు ఎంపికపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో రెండో టీ20లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా.. ఐపీఎల్ 2018 సీజన్లో అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్లకు చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్లు సైతం పెదవివిరిచారు.
దీంతో.. ఈ ఇద్దరిలో కనీసం ఒకరికి తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. తొలి టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ శుక్రవారం రాత్రి కూడా చెలరేగితే ఐర్లాండ్ బౌలర్లకి కష్టాలు తప్పవు.