టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చక్కటి శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు తొలి వికెట్కు 154 పరుగులు జోడించారు. వీరిద్దరి మధ్య ఇది 14వ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం.
లాథమ్కు క్యాచ్ ఇచ్చిన ధావన్
జట్టు స్కోరు 154 వద్ద ట్రెంట్ బౌల్ట్ వేసిన 26వ ఓవర్ రెండో బంతికి ధావన్(66) వికెట్ కీపర్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫర్గూసన్ విసిరిన షార్ట్ లెంగ్త్ బంతిని సిక్స్గా తరలించేందుకు ప్రయత్నించి రోహిత్ శర్మ(87) ఫీల్డర్ గ్రాండ్హోమ్ చేతికి చిక్కాడు.
సెంచరీని చేజార్చుకున్న రోహిత్ శర్మ
దీంతో సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ-అంబటి రాయుడుల జోడీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. రాయుడుతో కలిసి 64 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (43)ని షార్ట్పిచ్ బంతితో పెవిలియన్కు చేర్చాడు.
చివర్లో ధోని మెరుపులు
అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన అంబటి రాయుడు(47) పెవిలియన్కు చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోని (48 నాటౌట్), కేదార్ జాదవ్ (22 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అయితే, చివర్లో న్యూజిలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ దూకుడుగా పరుగులు చేయలేకపోయింది. దీంతో భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది.