ఇండోర్ : ఇప్పటికే టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుండగా.. కనీసం చివరి టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది కివీస్. ఇకపోతే ఈ ఉదయం ఇండోర్ వేదికగా ప్రారంభమైన భారత్-న్యూజిలాండ్ మూడో టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమ్ ఇండియా.
తాజా టెస్టు సిరీస్ ద్వారా టీమ్ ఇండియా నంబర్ వన్ ర్యాంకును కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక అన్నింటికన్నా ఆసక్తిని రేకెత్తిస్తోన్న విషయమేంటంటే.. రెండేళ్ల విరామం తర్వాత గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా తరుపున బరిలోకి దిగుతుండడం. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ గాయపడడంతో జట్టులో చోటు దక్కించుకున్న గంభీర్.. ఏ మేరకు రాణిస్తాడన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా మూడో టెస్టు కోసం జట్టులో చోటు సంపాదించాడు.

దూకుడుగా గంభీర్..
చాలారోజుల తర్వాత టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన గంభీర్.. మూడో టెస్టులో ఎటాకింగ్ స్టార్ట్ తో ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. మ్యాట్ హెన్రీ వేసిన మూడో ఓవర్లలో రెండు వరుస సిక్సర్లతో గంభీర్ మంచి ఊపు కనబరిచాడు. ప్రస్తుతం 14 బంతుల్లో 20 పరుగులతో(2 ఫోర్లు, 2 సిక్సర్ల)తో క్రీజులో ఉన్నాడు గంభీర్.
ఇక మరో ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం త్వరగానే పెవిలియన్ చేరాడు. జీతన్ పటేల్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగిన విజయ్ కేవలం 10(18) పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 35/1(6.0ఓవర్లు) గా కొనసాగుతోంది.